మాతృత్వం అనేది ప్రతి మహిళకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తారు. పురిటి నొప్పులను భరించి.. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. ఆ చిన్నారి ముఖం చూడగానే అప్పటి వరకు అనుభవించిన బాధను మర్చిపోతుంది. చిన్నారి స్పర్శతో మురిసిపోతుంది. మాతృత్వపు మధురిమలు అనుభూతి చెందే విషయంలో సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండదు. ఆ సంగతి పక్కకు పెడితే.. బిడ్డకు జన్మినిచ్చిన తర్వాత మహిళ శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. చాలా మంది బరువు పెరుగుతారు. గర్భధారణకు ముందున్నట్లు ఉండదు. నీరసంగా ఉంటుంది. చురుకుదనం తగ్గుతుంది. గతంలో మాదిరి శరీరం సహకరించదు. అందరి విషయంలో ఇలానే జరుగుతుందా అంటే కాదు. కొందరు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా మునుపటి ఎనర్జీ, అందాన్ని అలానే కాపాడుకుంటారు. కానీ తన విషయంలో మాత్ర శరీరం.. గర్భధారణకు ముందులా సహకరించడం లేదని అంటున్నారు చందమామ కాజల్ అగర్వాల్.
తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు చందమామ కాజల్. వరుస సినిమాలు చేస్తూ.. కెరీర్ పీక్స్లో ఉండగానే చిరకాల స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. ఆ వెంటనే గర్భం దాల్చి.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది కాజల్. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని బిడ్డకే కేటాయించింది. తన చిన్నారి ఆలనాపాలనా చూసుకుంటూ మురిసిపోతుంది. అయితే ప్రసవానంతరం తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది కాజల్. డెలివరీ బ్రేక్ తర్వాత తాజాగా ఆమె ఇండియన్ 2 సినిమా షూటింగ్లో పాల్గొన్నది. ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటుంది కాజల్.
ఈ సదర్భంగా కాజల్ తన ఇన్స్టాగ్రామ్లో ప్రసవానంతరం తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి వివరిస్తూ.. ఓ పోస్ట్ చేసింది. దానిలో కాజల్.. ‘‘డెలివరీ అయ్యాక నాలుగు నెలల తర్వాత.. ఎంతో ఉత్సాహంతో మళ్లీ నా వర్క్ స్టార్ట్ చేశాను. అయితే గతంలో మాదిరి అంత సులువుగా అనిపించలేదు.. కొత్తగా మొదలు పెట్టానా ఏంటి అనిపించింది. ప్రసవానికి ముందులా నా శరీరం ఇప్పుడు నాకు సహకరించడం లేదు. బిడ్డకు జన్మనివ్వక ముందు లొకేషన్స్లో ఎంతో వర్క్ చేసి.. ఆ తర్వాత ఎక్సర్సైజ్ కూడా చేసేదాన్ని. అలసిపోయినట్లు అనిపించేంది కాదు. కానీ ఇప్పుడు తల్లయ్యాక ఒకప్పటి నా ఎనర్జీ స్థాయిని అందుకోవడం కష్టంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది.
‘‘ప్రస్తుతం గుర్రపు స్వారీ చేయడం అనేది నాకో పెద్ద టాస్క్ అనిపిస్తంది. అయినా సరే పట్టుదలగా నేర్చుకుంటున్నాను. గతంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు శరీరం నా మాట వినేది. ప్రస్తుతం అలా సహకరించడం లేదు. కానీ పరిస్థితులు ప్రభావం వల్ల మన శరీరం మారొచ్చు.. కానీ మన ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. నన్ను నేను ఎంతో అప్డేట్ చేసుకుంటున్నాను’’ అని పోస్ట్ చేసింది కాజల్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.