శైలేష్ కొలను.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు రీసౌండింగ్ వస్తోంది. ఎందుకంటే హిట్ సెకండ్ కేస్ డిసెంబర్ 2న ప్రపంచంవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే హిట్ 2 సినిమాకి విదేశీ ప్రేక్షకుల నుంచి ట్విట్టర్ వేదికగా సూపర్ రెస్పాన్స్ అయితే వస్తోంది. హిట్ మొదటి కేస్ ఎంత హిట్ అయ్యిందో సెకండ్ కేస్ కూడా అంతే హిట్టు కొట్టిందని చెబుతున్నారు. ఇంక అడివి శేష్ విషయానికి వస్తే.. దుమ్ములేపాడంటున్నారు. ఇప్పటికే గూఢచారి, మేజర్ వంటి సినిమాల్లో ఇలాంటి సీరియస్ పాత్రలకు బాగా అలవాటు పడిపోయాడు. అలాగే యూనిఫార్మ్ లో అడివి శేష్ ప్రేక్షకులకు బాగా నచ్చేశాడు కూడా. ఇప్పుడు ఈ హిట్ సినిమా గురించి ఇంకా చాలా వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హిట్ సినిమా ఒకటి రెండు భాగాలతో ముగిసిపోయేది కాదని ఇప్పటికే దర్శకనిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. హిట్ యూనివర్స్ ని మొత్తం 7 భాగాలుగా ప్లాన్ చేసినట్లు నిర్మాతల్లో ఒకరైన న్యాచురల్ స్టార్ నాని ప్రకటించాడు. ఈ ప్రకటన తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా 3వ పార్ట్ లో హీరోని సెకండ్ కేస్లోనే పరిచయం చేస్తామన్నారు. 3వ సినిమాలో ఎవరు ఉండబోతున్నారు అనే దానిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈసారి న్యాచురల్ స్టార్ నాని కూడా హిట్ యూనివర్స్ లో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే విజయ్ సేతుపతిని కూడా ఈ సినిమాలోకి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
అయితే ఇప్పుడు ఈ హిట్ యూనివర్స్ లోకి రాబోయే కొందరు పేర్లు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అవి సాదాసీదా హీరోల పేర్లు మాత్రం కాదు. టాలీవుడ్ టాప్ హీరోలు పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ హిట్ యూనివర్స్ లోకి అడుగు పెడతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కామెంట్స్ చేసింది మరెవరో కాదు.. ఏకంగా నిర్మాత నాని, హీరో అడివి శేష్ ఈ మాటలు అన్నారు. సుమతో కలిసి వీళ్లు సినిమా ప్రమోషన్స్ చేశారు. ఆ సమయంలో సుమ వీరిని పవన్ కల్యాణ్- మహేశ్ బాబు రాబోతున్నారా ఈ హిట్ యూనివర్స్ లోకి అంటూ ప్రశ్నించింది. అందుకు నాని వాళ్లు రారు అని ఖండించలేదు. పైగా రావచ్చేమో అంటూ పరోక్షంగా రెస్పాండ్ అయ్యాడు. కాబట్టి వాళ్లు రారు అని గట్టిగా చెప్పే అవకాశం కూడా లేదంటున్నారు. ఈ వార్త విన్న మహేశ్- పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి సైకో థ్రిల్లర్లో వారి అభిమాన హీరో నటిస్తే బావుంటుందని చెబుతున్నారు.