దసరా సినిమా థియేటర్లోనే కాక.. ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. దసరా సినిమా చూసిన వారు.. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ చూడగానే.. ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తున్నారు. సినిమాలో చూపించినట్లే.. వాస్తవంగా జరిగింది. ఎక్కడంటే..
నాని, కీర్తి సురేష్ జంటగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమా మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. తెలంగాణ యాసతో వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. నాని కెరీర్లోనే అత్యధికంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ చిత్రం. థియేటర్స్లో దుమ్మురేపిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 27 నుంచి ఈ చిత్రం.. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్లో వచ్చిన ఈ చిత్రం.. ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది.
ఇక థియేటర్లో ఈ చిత్రం చూడని వారు, పెద్ద వయసు వారు.. ఓటీటీలో దసరా మూవీ చూస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్వెల్కు ముందు వచ్చే సీన్ చూసిన వారు కారంచేడు దుర్ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. దసరా సినిమాలో వచ్చిన ఈ సన్నివేశం.. కారంచేడు ఘటన ఆధారంగానే తెరకెక్కించారా అని చర్చించుకుంటున్నారు. మరి ఇంతకు కారంచేడు సంఘటన ఏంటి.. ఏం జరిగింది అంటే.. నందమూరి తారక రామరావు 1984లో తెలుగు దేశం పార్టీ స్థాపించి.. ఆరు నెలల్లోనే అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత.. 1985 జులై 17 ప్రకాశం జిల్లా, కారంచేడులో దారుణం చోటు చేసుకుంది. ఈ దారుణం జరిగి ఇప్పటికి 38 ఏళ్లు. రెండు సామాజిక వర్గాల మధ్య తాగు నీటి చెరువు వద్ద చోటు చేసుకున్న ఘర్షణ.. ఒళ్లు గగుర్పొడిచే నరమేధానికి దారి తీసింది. ఓ వర్గం జనాలు.. మరో వర్గం వారి వెంట పడ్డారు. కత్తులు, బరిసెలు, గండ్రగొడ్డళ్లు సహా మారణాయుధాలు పట్టుకుని తెగబడ్డారు. వెంటాడి, వేటాడి మరి ఊచ కోత కోశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ ఘటన మాయని మచ్చగా నిలిచింది.
ఈ ఘటన అనంతరం పీపుల్స్ వార్ గ్రూప్కు చెందిన మావోయిస్టులు.. ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి చెంచు రామయ్యను హత్య చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఎన్ని నష్ట నివారణ చర్యలు తీసుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. 1989 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయింది. ఇక దసరాలో ఇంట్రవెల్కు ముందు ఇలాంటి సన్నివేశమే వస్తుంది. విలన్ గ్యాంగ్.. నాని, అతడి స్నేహితులను వెంటాడి, వేటాడి మరి దారుణంగా హత్య చేస్తుంది. ఆ తర్వాత ఆ నెపాన్ని నక్సలైట్ల మీదకు తోస్తారు. ఈ సీన్లు చూసిన మధ్యవయస్కులు.. నాటి కారంచేడు ఘటననే గుర్తు చేసుకుంటున్నారు. ఈ సీన్ను.. ఆ సంఘటన ఆధారంగానే తెరకెక్కించి ఉంటారని భావిస్తున్నారు. కానీ చిత్ర బృందం మాత్రం దీని గురించి ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. కారంచేడు ఘటన చోటు చేసుకున్న ఏడేళ్ల తర్వాత అనగా 1991లో గుంటూరు, చుండూరులో కూడా ఈ తరహా సంఘటనే చోటు చేసుకుంది. ఇది కూడా చరిత్రలో మాచని మచ్చగా నిలిచింది. ఏది ఏమైనా దసరా సినిమా మాత్రం భారీ విజయం సాధించింది. మరి మీరు దసరా సినిమా చూశారా.. మీకు ఎలా అనిపించింది కామెంట్స్ రూపంలో తెలియజేయండి.