ప్రముఖ హీరోయిన్ సాయిప్రియ దర్శకుడు వడి ఉడయాన్పై మండిపడ్డారు. మీడియా ప్రతి నిధుల ముందే ఆయనపై ఫైర్ అయ్యారు. ఎందుకు తనను సినిమా విషయంలో పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. కావాలనే తనను కార్నర్ చేస్తున్నారని ఆరోపించారు. ఆమె తాజా చిత్రం ‘‘పాంబట్టమ్’’ సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా, ‘‘పాంబట్టమ్’’ సినిమా ప్రెస్ మీట్ చెన్నైలోని ఓ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు వడి ఉడయాన్, హీరో జయన్, హీరోయిన్ సాయిప్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిప్రియ మాట్లాడుతూ..
‘‘ మీరు సినిమా చేసే మొదట్లో నాకు ఏం చెప్పారు? నేనే ఈ సినిమాలో హీరోయిన్ అని చెప్పారు కదా? కానీ, ఇప్పుడలా నాకు అనిపించటం లేదు. అంతా వేరేలా ఉంది. కానీ, ఎందుకో తెలీదు. నన్నే కార్నర్ చేస్తున్నారు. మొదట నేనే ఇందులో హీరోయిన్ అన్నారు. ఇప్పుడేమో.. ఓ మంచి ముఖ్యమైన రోల్ అంటున్నారు. చాలా చోట్ల నా పేరు చెప్పటం లేదు. వ్యక్తిగతంగా మనిద్దరి మధ్యా ఎలాంటి గొడవలు లేవు. నా మీద కోపాన్ని మీరు ఇతరుల మీద చూపిస్తున్నారు. నేను మీ సినిమా కోసం పడ్డ కష్టాన్ని మీరు గౌరవించాలి. మీతో రాత్రి, పగలు ఈ సినిమా కోసం కష్టపడ్డాను.
మంచి నటులతో సినిమా తీసే సమయంలో మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సాయిప్రియ 2017లో వచ్చిన ‘‘శివలింగ’’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. తర్వాత ‘‘ఎంటె ఉమ్మంటే పేరు, బూమ్ బూమ్ కాలయ్, యుద సాతమ్’’ సినిమాల్లో నటించారు. ‘‘పాంబట్టమ్’’ సాయిప్రియ నటించిన ఐదో సినిమా. ఈ సినిమాలో జీవన్ హీరోగా నటించాడు. రితికా సేన్, సాయిప్రియ, మల్లికా షరావత్ కీలక పాత్రల్లో చేస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.