దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరిని వణికిస్తోంది. ఈ సంక్షోభ సమయంలో ఎవరికి తోచిన సహాయం వారు చేస్తున్నా.., అవేవి ప్రజల ప్రాణాలను కాపాడే స్థాయికి సరిపోవడం లేదు. మరో వైపు మన ప్రభుత్వాలు కరోనా నియంత్రణలో పూర్తిగా విఫలం అయ్యాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ తో విరుచుకపడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో దైర్యం నింపడానికి స్టార్ హీరోలు తమ వంతుగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇందులో భాగంగానే స్టార్ హీరో నిఖిల్ ఇన్ స్టా వేదికగా తన బాధని తెలియచేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశాడు. నాకు గత మూడు వారాలుగా షూటింగ్ లేదు. చేస్తున్న సినిమాలు ఆగిపోయాయి. ప్లానింగ్స్ అన్నీ దెబ్బ తిన్నాయి. అయినా పరవాలేదు. ప్రాణాలకన్నా ఏది ముఖ్యం కాదు. ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటున్నా. కానీ.., సమాజంలో నా చుట్టూ జరుగుతున్న మరణాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఇలాంటి సమయంలో మనిషికి సాటి మనిషే తోడు. ప్రభుత్వాలను నిందిస్తూ కూర్చుంటే లాభం లేదు. తమకు తోచిన సహాయం చేయాలంటూ ఓ వీడియోని పోస్ట్ చేశాడు నిఖిల్.
తన మిత్రులు, ఎన్జీవోల ద్వారా తనకు తోచిన సహాయం చేస్తున్నట్లు అతను తెలిపాడు. అయితే.., ఇది ఏ మాత్రం సరిపోవట్లేదని నిఖిల్ అన్నాడు. కళ్ల ముందే ప్రాణాలు పోతున్నాయని అతను బాధపడ్డాడు. అంతేకాక, మనల్ని ఎవరో వచ్చి కాపాడుతారు అనుకోవడం జరగని పని అని చెప్పిన నిఖిల్.. ప్రతీ ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని సూచించాడు. అలాగే.., ప్లాస్మా డొనేషన్ విషయంలో అపోహలు విడిచి.., అందరూ తోటి ప్రాణాలను కాపాడాలని నిఖిల్ వేడుకున్నాడు. ఇదే సమయంలో నిఖిల్ మాత్రం పోలీటీషన్స్ పై ఓ రేంజ్ లో సెటైర్స్ పేల్చాడు. మీరు.. మీ నాయకుల కోసం ఎదురు చూడకండి. వారంతా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.., రాజకీయ లబ్ది పొందటంలో బిజీగా ఉన్నారు. కాబట్టి.. మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలని నిఖిల్ సూచించాడు. ఇక ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వేరే వాళ్లకు మానవత్వంలో సహాయం చేసే వాళ్లని చూసి తనకు ఆనందం కలుగుతుందని నిఖిల్ చెప్పాడు. చివర్లో ప్రతీ ఒక్కరు కూడా దయచేసి పక్కవాళ్లకు సహాయం చేయాలని నిఖిల్ కోరడం విశేషం. ఎప్పుడూ నవ్వుతు, నవ్విస్తూ మాట్లాడే నిఖిల్ ఇలా మొదటిసారి ఎమోషనల్ వీడియో షేర్ చేయడంతో.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో కొంత మంది దాతలు ఎన్జీవోలకి తమ వంతుగా సహాయం చేస్తుండటం విశేషం.