ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) గోల్డెన్ వీసాను అల్లు అర్జున్ కు దుబాయ్ ప్రభుత్వం జారీ చేసింది. ఈ వీసాను పొందిన తొలి టాలీవుడ్ నటుడిగా ఆయన నిలిచారు. తనకు గోల్డెన్ వీసా జారీ చేసిన విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్న ఆయన..దుబాయ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ‘గోల్డెన్ వీసా అందించి.. మరోసారి అద్భుతమైన అనుభూతిని అందించినందుకు దుబాయ్ కి ధన్యవాదాలు. త్వరలో మళ్లీ కలుద్దాం’ అని అక్కడి ఫోటోలను షేర్ చేశారు.
కాగా, ఈ గోల్డెన్ వీసాను దుబాయ్ ప్రభుత్వం కొంత మంది సెలబ్రిటీలకు మాత్రమే జారీ చేస్తుంది. ఈ వీసాను పొందిన వారిలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, సంజయ్ దత్, వరుణ్ థావన్, ఫరాఖాన్, కమల్ హాసన్, మమ్ముటీ, దుల్కర్ సల్మాన్, టోవినో థామస్, మోహన్ లాల్, సోనూసూద్, రణవీర్ సింగ్, విజయ్ సేతుపతి, ఊర్వశీ రౌతాలా, నేహా కక్కర్, సునీల్ శెట్టి, విక్రమ్, ఖుష్బు, కాజల్ అగర్వాల్, అమలాపాల్, త్రిష, మీనా, రామ్ చరణ్ సతీమణి ఉపాసన, క్రీడాకారిణి సానియా మీర్జా ఉన్నారు.
2019 నుండి దుబాయ్ ప్రభుత్వం ఈ వీసాలను జారీ చేస్తుంది. ఈ గోల్డెన్ వీసాను పొందే వ్యక్తులు యూఏఈ రాజధాని అబుదాబీ లేదా దుబాయ్ లో పదేళ్ల పాటు నివాసం ఉండొచ్చు. విదేశీయులు వారి దేశంలో ఎక్కువ కాలం నివసించేందుకు దుబాయ్ ప్రభుత్వం 2019లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వీసా కలిగిన వ్యక్తులు తమ కుటుంబ సభ్యులతో దుబాయ్ లో పదేళ్ల పాటు నివసించవచ్చు. కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప-2 షూటింగ్ లో పాల్గొంటున్నారు.