బుల్లితెరపై తన ప్రస్థానం మొదలు పెట్టిన రాజమౌళి, ఎన్టీఆర్ నటించిన ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అయ్యారు. టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకధీరుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ప్రతి చిత్రం విషయంలో తనదైన మార్క్ చాటుకుంటూ వస్తున్నారు. ఈగ చిత్రంలో గ్రాఫిక్ మాయాజాలంతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రభాస్ తో తెరకెక్కించిన ‘బాహుబలి’లాంటి జానపద చిత్రంతో జాతీయ స్థాయిలో తెగులు చిత్ర రంగాన్ని ఓ రేంజ్ కి తీసుకు వెళ్లారు.
20 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో సంచలన విజయాలు అందుకున్నాడు రాజమౌళి. ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు జక్కన్న. బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాడు. అయితే బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ ని రెండు భాగాలు ఐదేళ్లలో పూర్తి చేశారు. అందుకు తగ్గ ప్రతిఫలాన్ని కూడా ఆయన అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సంచలనాలు కొనసాగిస్తూ.. 1500 కోట్ల మార్క్ దాటేసింది. అలాంటి దర్శకుడు ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ విషయంలో టెన్షన్ పడుతున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మూడేళ్లుగా ఒకే సినిమాను చెక్కుతూనే ఉన్నాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి టాప్ హీరోలు నటిస్తున్నారు.
2019లో ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడు 2020 జూలై 30న విడుదల చేస్తానని మాటిచ్చాడు రాజమౌళి. అంతలోనే కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ఈ సినిమా షూటింగ్ లో అంతరాయాలు ఏర్పడుతూ వస్తున్నాయి. ఇలా రిలీజ్ డేట్స్ విషయంలో వాయిదాలు పడితే ప్రేక్షకులకు విసుగు పుట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓ వైపు ఆర్ఆర్ఆర్ మూవీ బడ్జెట్ 550 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే కనీసం 1,000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించాలి. అయితే బాహుబలి2 సినిమా రిలీజ్ సమయంలో మంచి హిట్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి.
కానీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా భయం చోటు చేసుకుంది.. థియేటర్లు కూడా ఆ స్థాయిలో దొరుకుతాయన్న నమ్మకం లేదు. ఆర్ఆర్ఆర్ మూవీ బడ్జెట్ 550 కోట్లు.. దానికి తగ్గట్లుగానే బిజినెస్ కూడా జరగాలి.. జరిగిన బిజినెస్ కు తగ్గట్టుగా కలెక్షన్స్ కూడా రావాలి. ఎంత పెద్ద దర్శకుడు అయిన కెరీర్లో ఒక్కోసారి భయపడతాడు. తన సినిమా విషయంలో టెన్షన్ పడతాడు. దర్శక ధీరుడు రాజమౌళికి కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిందని… ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్, కలెక్షన్ల గురించి ఒకంత కలవరపడుతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.