“కాంతార”.. ఇప్పుడు ఈ మాట దేశాన్ని ఊపేస్తోంది. నిజానికి మన అందరికీ ఇది కేవలం ఒక సినిమానే కావచ్చు. కానీ.. ఈ సినిమా కర్ణాటక ప్రాంతంలో నివశించే ఒక తెగ జీవన విధానానికి అనుసంధానమై ఉంది. వారి కళలకి, నమ్మకాలకి, సంస్కృతులకి “కాంతార” ఒక నిలువుటద్దంలా నిలిచింది. అయితే.. “కాంతార” నిజంగా జరిగిన కథేనా? మంగళూరు ప్రాంతంలో ఉండే “తుళు” పరంపర ప్రజలకి నిజంగానే ఆత్మలు కనిపిస్తాయా? అసలు కాంతారలో మనం చూసిన డ్యాన్స్ కి, దేవుడికి సంబంధం ఏంటి? మనిషిలోకి దేవుడు రావడం ఏంటి? అందరూ చూస్తుండగా ఆ మనిషి మాయం అవ్వడం ఏంటి? మూడు దశాబ్దాల క్రితం ఈ రిషబ్ శెట్టి సొంత ఊరులో జరిగిన సంఘటన ఏంటి..? ఇలాంటి అన్నీ విషయాలకి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.
“కాంతార” కట్టు కథా? కాదా? అనే విషయంలోకి వెళ్లే ముందు మనం కొన్ని విషయాలు గురించి మాట్లాడుకుందాం. మన ఊర్లలో అమ్మవారి ఊరేగింపులో ఉన్నట్టుండి మహిళలకి అమ్మవారు ఆవహిస్తుంటుంది. ఆ సమయంలో ఆ స్త్రీ అసామాన్యంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. బక్క పలచగా ఉండే ఆమెని పట్టుకోవడానికి 10 మంది కూడా సరిపోరు. ఆ సమయంలో ఆమె బిందెడు పసుపు నీళ్లు అవలీలగా తాగుతుంది. మాములుగా అయితే.. ఓ వ్యక్తి అన్ని నీళ్లు తాగగలరా? పూనకం వచ్చిన సమయంలో ఆ స్త్రీలో అంతటి శక్తి ఎక్కడ నుండి వస్తుంది? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న! కానీ.., మనలో చాలా మంది ఈ విషయాన్ని అస్సలు సీరియస్ గా తీసుకోరు. నిజానికి.. ఇలా అమ్మవారు ఒంట్లోకి వచ్చి గ్రామాల్లో జరుగుతున్న ఎన్నో అన్యాయాలను బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా?
ఇక హైదరాబాద్ అంతటా అత్యంత వైభంగా జరిగే “లష్కర్ బోనాల” జాతర అందరికీ తెలుసు కదా? అప్పుడు జరిగే “రంగం” కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు సైతం హాజరవుతుంటారు. అక్కడ అమ్మవారి భక్తురాలు చెప్పే “భవిష్యవాణి” పొల్లు పోకుండా జరిగిన సందర్భాలు ఎన్ని లేవు? నిజానికి ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగే, జరుగుతున్న అద్భుతాలే. కానీ.., మనలోని శాస్త్రీయ కోణం ఆ నిజాలను ఒప్పుకోనివ్వదు. అయితే.., ఈ జాతరలో వచ్చే పూనకాలను, బోనాల సమయంలో చెప్పే భవిష్యవాణిని కనీసం మన సంస్కృతి, సాంప్రదాయంగా ఎందుకు చూడలేకపోతున్నాం? సంస్కృతి, సాంప్రదాయాలు అంటే.. నిజాలు, అబద్ధాలు కాదు. మనం పెరిగిన జీవిన విధానం కదా. ఇదే పాయింట్ ని రిషబ్ శెట్టి తన కథా వస్తువుగా మార్చుకున్నాడు. తమ పూర్వీకుల నమ్మకాలను “కాంతార” కథకి ముడి సరుకుగా మార్చుకున్నాడు.
కన్నడ నటులైన “అనుష్క శెట్టి, కృతి శెట్టి, రక్షిత్ శెట్టి, రోహిత్ శెట్టి, రాజ్ బి శెట్టి, శిల్పా శెట్టి, సునీల్ శెట్టి, శ్రీనిధి శెట్టి, ఐశ్వర్య రాయ్” వీళ్లంతా మీకు తెలుసు కదా? కాంతార మూవీ కథ వీరందరి పూర్వీకుల చరిత్ర. వీరి కులం పేరు “బంట్”. వీరి భాష తుళు. నిజానికి బంట్ అంటే పోరాటం అని అర్థం. వీరంతా తరువాత కాలంలో మూడు రకాలుగా విడిపోయారు. కొంతమంది మతాన్ని కూడా మార్చేసుకున్నారు. కానీ.., వీరందరూ ఈ నాటకీ ఉమ్మడిగా నమ్మే నమ్మకం పేరు మాత్రం “కంబళ”. కాంతార మూవీలో మనం చూసిన నృత్యం పేరే “కంబళ”. భూతకళలో ఇదీ ఒకటి. తమ కులంలో మరణించిన పూర్వీకులు తమ చుట్టే ఆత్మల్లా తిరుగుతూ.. తమకి సంకేతాలు పంపిస్తూ ఉంటారని వీరి నమ్మకం.
“కంబళ”లాంటి జానపద నృత్యంతో ఆరాధిస్తే.. తమ పూర్వీకులు కోలం కట్టిన వారిలోకి ఆవహిస్తారని, వారే ఆ సమయంలో తమ దైవం అని వీరి నమ్మకం. నిజానికి యక్షగానాల్లో ఒకటైన ఈ కళని ప్రదర్శించడం అంత సులభం కాదు. ఇది అందరికీ వచ్చే విద్య కూడా కాదు. అందుకే ఇప్పుడు ఈ “కోలం” కట్టే వారి సంఖ్య దాదాపుగా అంతరించిపోయే స్థితికి వచ్చేసింది. తమ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే ఇలాంటి ఓ కళని కాపాడుకోవడానికి రిషబ్ శెట్టి.. సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేసిన గొప్ప ప్రయత్నమే “కాంతార”. అయితే.. సినిమాలో చూపించినట్టు కోలం కట్టిన మనిషి మాయం అవ్వడం అనేది నిజంగా జరిగింది కాదు. రిషబ్ శెట్టి సొంత గ్రామంలో సుమారు 3 దశాబ్దాల క్రితం కొన్ని ఘటనలు జరిగాయట. అక్కడ కోలం కట్టిన అతను చెప్పినట్టే కొంతమంది వ్యక్తులు అకాల మరణం చెందినట్టు సమాచారం. ఆ ఘటనలు ఆధారంగానే రిషబ్ శెట్టి కాంతార కథని అల్లుకున్నాడు.
ఒకరకంగా చూస్తే “కాంతార” మనకి తెలియని కథ కాదు. మనకి గ్రామాల్లో సోది చెప్పే వాళ్ళు ఉంటారు. సోదిలో కూర్చున్న తరువాత వారిలోకి మన పూర్వీకులు వస్తారు. అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి వెళ్ళిపోతారు. ఒక్కోసారి వారిలోకి మన కులదైవం కూడా వస్తుంది. పోగొట్టుకున్న వస్తువు ఏ దిక్కున ఉందో చెప్తుంది. ఆ సోది ప్రకారం ఆ దిక్కుగా వెళ్తే పోగొట్టుకున్న వస్తువులు దొరికిన సందర్భాలు కొన్ని వందల్లో ఉన్నాయి. కానీ.., సోది అయ్యాక మాత్రం ఆ వ్యక్తి అమాయకంగా మనం ఇచ్చే చిల్లర డబ్బులు తీసుకుని వెళ్లిపోతుంటుంది! నిజానికి కాంతార సినిమాలో చూపించింది కూడా ఇదే కదా? సో.. కాంతార కథ అబద్ధం కాదు, కొత్తది అంతకన్నా కాదు. కాంతారా నిజమైన కథే. ఇంకా చెప్పాలంటే మనకి తెలిసిన కథే. కాకుంటే.. మనం మన సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు పట్టించుకోవడం లేదు, కన్నడ వాళ్ళు పట్టించుకున్నారు అంతే తేడా.