తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలిగిపోయిన అందాల తార త్రిష ఈ మద్య లేడీఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు సంచలన దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం తెరెకెక్కించడం మొదలు పలు వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష, కార్తి, జయం రవి, విక్రమ్ ప్రభు, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇటీవల సినిమా షూటింగ్ సెట్ లో ఓ గుర్రం మరణించడంతో మణిరత్నంపై కేసు నమోదయ్యింది. పెటా ఇండియా మణిరత్నంతో పాటు సినిమా నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్ మరియు గుర్రం యజమానిపై కూడా కేసు నమోదు చేసింది. తాజాగా ఇప్పుడు త్రిష ఓ వివాదంలో చిక్కుకుంది. త్రిష, మణిరత్నాన్ని అరెస్ట్ చేయాలి అంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఆమె దేవాలయంలో చెప్పులు వేసుకొని తిరగడమే. ప్రస్తుతం ఈ సినిమా ఇండోర్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో భాగంగా త్రిష కారు దిగి చెప్పులతో శివుడు, నంది విగ్రహాల మధ్య నడుచుకుంటూ వచ్చిన సన్నివేశాలను చిత్రీకరించారు.
పవిత్ర స్థలంలో చెప్పులు వేసుకొని నడిచినందుకు ఆమెపై హిందూ ధార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. తక్షణం ఆమెపై కేసు నమోదుచేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. హిందువులు పవిత్రంగా పూజించే శివుడు, నంది విగ్రహాలు ఉన్న ప్రాంతంలోచెప్పులు వేసుకొని రావడం.. సరైనది కాదు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఈ వివాదాన్ని త్రిషతో పాటు సినిమా యూనిట్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.