తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ నిర్మాతల పాలిట రియల్ హీరో అనిపించుకున్నారు. టాలీవుడ్ కి టెక్నాలజీ పరిచయం చేసిన ఘనత ఆయనదే. సాహసానికి మారుపేరుగా నిలిచిన ఏకైక హీరో కృష్ణ. హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన అభిరుచిని చాటుకున్నారు. తన ధైర్య, సాహసాలతో, ప్రయోగాలతో, కొత్త కొత్త ఆలోచనలతో సినీ కళారంగాన్ని కొత్త పుంతలు తొక్కించినటువంటి నట శేఖరుడు, సినీ లోకాన ధృవ తారలా వెలిగిన సూపర్ స్టార్ కంటికి కనిపించనంత దూరం వెళ్లిపోయారు.
ఆ పై లోకంలో వాడు కృష్ణతో ఏమైనా సినిమాలు ప్లాన్ చేశాడో ఏమో.. జేమ్స్ బాండ్, కౌబాయ్ తరహా సినిమాలు తీయాలని భావించాడో ఏమో.. అల్లూరి సీతారామరాజు లాంటి కథని రీమేక్ చేయాలని అనుకున్నాడో ఏమో.. కనికరం లేకుండా తీసుకెళ్లిపోయాడు. కోట్ల మంది ఆయన అభిమానులు బాధపడతారన్న కనీస ఆలోచన లేకుండా తీసుకెళ్లిపోయాడు. కృష్ణ మరణవార్త తెలియగానే సినీ లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటు అని సినీ, రాజకీయ ప్రముఖులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అభిమానుల సందర్శనార్థం ఇవాళ కృష్ణ పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోస్ కి తరలించారు. పద్మాలయ స్టూడియోస్ కి చేరుకున్న ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ హైదరాబాద్ పద్మాలయ స్టూడియోస్ కి చేరుకొని కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మహేష్ కుటుంబానికి సంతాపం తెలియజేశారు.