హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు విచ్చేశారు. సాధారణంగా ప్రవచన కర్తలు చాలా సౌమ్యంగా ఉంటారు. కానీ ఈ కార్యక్రమంలో గరికపాటి వారు సహనం కోల్పోయి వ్యవహరించారు. గరికపాటి గారికి సెల్ఫీల కోసం ఎగబడడం అంటే ఇష్టం ఉండదు. గతంలో ఆయన మీద అభిమానంతో కొంతమంది సెల్ఫీల కోసం ఎగబడితే నిర్మొహమాటంగా స్టేజ్ దిగిపోమన్నారు. లేదంటే వెళ్ళిపోతా అన్నారు. అలానే ఇప్పుడు కూడా చిరంజీవి విషయంలో జరిగితే ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు.
శిఖరం లాంటి చిరంజీవి రాక రాక వచ్చారని, అభిమానులు ఫోటోల కోసం ఎగబడ్డారు. “మీరు ఫోటోసెషన్ ఆపితే నేను ప్రవచనం మొదలుపెడతాను. లేదంటే వెళ్ళిపోతాను. నాకేం మొహమాటం లేదు. చిరంజీవి గారు దయచేసి ఫోటోసెషన్ ఆపండి” అని గరికపాటి నరసింహారావు అన్నారు. ఆయన ఒక్కసారిగా అలా అనేసరికి మెగాస్టార్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మెగాస్టార్ ని అలా అనడం ఏమిటని అందరూ గరికపాటి గారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నిజానికి మెగాస్టార్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకోలేదు సరికదా.. గరికపాటి వారిని శిరస్సు వంచి నమస్కారం పెట్టారు కూడా. అయితే అంతటి మెగా శిఖరం సంస్కారంతో మీ ముందు తల వంచితే.. ఆ వ్యక్తిత్వాన్ని గుర్తించకుండా ఎలా ఆయన మీద అసహనంతో మాట్లాడుతారంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు.
అది కాస్తా మెగాస్టార్ వర్సెస్ గరికపాటి అభిమానుల మధ్య యుద్ధంలా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చిరు వర్సెస్ గరికపాటి అభిమానుల మధ్య చర్చ నడుస్తుంది. చిరుది తప్పని గరికపాటి అభిమానులు, గరికపాటిదే తప్పని చిరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా గొడవ పడుతున్నారు. కొంతమంది బ్రాహ్మణ సంఘాల వారు కూడా గరికపాటి వారికి మద్దతుగా ముందుకు వచ్చారు. ఈ వివాదం పెద్దదయ్యేలా ఉందని చిరంజీవితో, గరికపాటి మాట్లాడి ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని మెగాభిమాని ప్రయత్నం చేశారు. రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు భవానీ రవికుమార్ స్వయంగా గరికపాటి నరసింహారావుకి కాల్ చేసి మాట్లాడారు.
“సంస్కారవంతుడైన చిరంజీవిని మీరు అలా అనడంతో మెగాభిమానులు చాలా బాధపడ్డారని, అయితే వారి ఆగ్రహాన్ని చల్లారుస్తామని,.. ఏమీ అనుకోకుండా చిరంజీవితో మీరు మాట్లాడాలి” అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన గరికపాటి.. తప్పకుండా మాట్లాడతానని అన్నారు. దీంతో ఈ వివాదానికి తెరపడినట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఒకవైపు మెగాస్టార్, మరోవైపు ప్రవచన స్టార్ ఇద్దరూ ఇద్దరే. తమ తమ రంగాల్లో వ్యక్తులను, వ్యక్తిత్వాలను అత్యంత ప్రభావితం చేసే శక్తి వారికుంది. ఇద్దరూ డైలాగ్ కింగ్ లే. పదునైన డైలాగులతో ఒకరు సినిమాల్లోనూ, మరొకరు నిజ జీవితంలోనూ ప్రభావితం చేస్తారు. మంచి వ్యక్తుల మధ్య గొడవ అనేది సమాజానికి అంత శ్రేయస్కరం కాదు. అందుకే మెగా వీరాభిమాని దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గరికపాటి నరసింహారావు గారితో ఫోన్ లో మాట్లాడిన రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు భవానీ రవికుమార్ గారు……
🔥🔥🔥 pic.twitter.com/8H17PD0LQS— షరీఫ్ జనసేన (SJ)BSU (@THEWARRIORSJ) October 7, 2022