ఏపీలో సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్లైన్లో విక్రయించేలా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఈ విషయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఆన్లైన్లో టికెట్లను ప్రభుత్వమే విక్రయించాలని సినీ పెద్దలైన చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి చెప్పినట్లు మంత్రి వెల్లడించారు. గతంలో ఒక సారి ముఖ్యమంత్రి జగన్లో భేటి అయిన సినీ పెద్దలు ఈ విషయాన్ని ప్రభుత్వానికి సూచించినట్లు, వారి ప్రతిపాదన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. కాగా మరో సారి సినీ పెద్దలను కలిసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో ఈ విషయంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రభుత్వం సినిమా టికెట్లను అమ్మడం అనే అంశం వివాదస్పదమే అయింది. అటు చిత్ర పరిశ్రమలోనూ, ఇటు రాజకీయంగానూ హాట్ టాపిక్గా మారింది.