పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భీమ్లా నాయక్ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక సినిమా సాధించిన సక్సెస్ గురించి దర్శకుడు సాగర్ చంద్ర విలేకర్లతో మాట్లాడుతూ పలు విషయాలు షేర్ చేసుకున్నారు.
‘భీమ్లా నాయక్’ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ఫస్ట్ లాక్ డౌన్ సమయంలో నిర్మాత వంశీ గారు ఫోన్ చేసి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం గురించి మాట్లాడి, ఆ సినిమా చూసి అభిప్రాయం చెప్పమన్నారు. కొద్దిరోజులకు మళ్లీ ఫోన్ చేసి ఈ సినిమా చేద్దామనుకుంటున్నాం. నీకు ఇంట్రెస్ట్ ఉందా అనడిగారు. నేను వెంటనే ఓకే అన్నా. ఆ తర్వాత త్రివిక్రమ్ గారితో జర్నీ మొదలైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, రానా గారు రావడంతో మరింత ఎగ్జైటింగ్గా ముందుకెళ్లాం.
ఎలాంటి మార్పులు చేశారు?త్రివిక్రమ్ గారితో చర్చల్లో కూర్చుని మొదట చర్చించింది కోషి పాత్రను భీమ్లాకు ఎలా మార్చాలి అనే దగ్గర మొదలైంది. అసలు ఇది రీమేక్ అని మరిచిపోయాం. మెయిన్ కథ, కమర్షియల్ అంశాలు, పవన్ – రానా పాత్రల బ్యాలెన్స్ చేయడం వంటి అంశాల మీద ఎక్కువ దృష్టిపెట్టాం. దీని రీమేక్ హక్కులు మరొకరు తీసుకోవాలి అన్నట్లు పని చేయాలి అని త్రివిక్రమ్ గారు ముందే చెప్పారు. ఆయన అన్న మాటను ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం అనుకుంటున్నా.
స్టార్హీరోను డైరెక్ట్ చేయడం మీకు సులభమా? కష్టమా?
అది మన మైండ్ సెట్ మీద ఆధారపడుతుంది. త్రివిక్రమ్ గారు రైటింగ్లో అయినా, డైరెక్షన్ లో అయినా సీనియర్ పర్సనాలిటీ. ఆయన సజెషన్స్ ఏ టెక్నీషియన్ కైనా అవసరమే. ఇద్దరు స్టార్స్తో కలిసి పనిచేయడం అనేది యుద్ధంలాగే ఉంటుంది. దానిని మనం ఎంతగా ఓన్ చేసుకున్నాం. అవుట్ పుట్ బాగా రావడానికి ఏం చేశాం అన్నది ముఖ్యం.
సినిమా ప్రారంభానికి ముందు ఆ తర్వాత పవన్కల్యాణ్ ఏం చెప్పారు:‘వకీల్ సాబ్’ సినిమా సెట్లో కళ్యాణ్ గారిని వన్ టు టైమ్స్ కలిశా. అప్పుడు కోర్టు రూమ్ సీన్ చేస్తున్నారు. సినిమా గురించి మాట్లాడుతుండగా ‘బాగా తీయ్.. బాధ్యతగా పని చేయ్’ అని చెప్పారు. అంతే ఎనర్జీతో మేం పనిచేశాం. ఆ తర్వాత జర్నీ అంతా అందిరికీ తెలిసిందే.
మూడు సినిమాల దర్శకుడిగా మీలో వచ్చిన మార్పు?
‘అయ్యారే’ సమయంలో సినిమా తీయాలనే తపన తప్ప ఇంకేం తెలీదు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’తో పరిచయాలు పెరిగాయి. కొంత అవగాహన వచ్చింది. ఒక అడుగు ముందుకెళ్లేలా చేసింది. ఇక ‘భీమ్లానాయక్’ నన్ను మరో మెట్టు ఎక్కించింది. ఈ మూడు సినిమాల వల్ల నాకు మంచే జరిగింది.
భారీ విజయం తర్వాత ప్రశంసలు అందుతుంటాయి. ఎలా అనిపిస్తుంది:ఒక సినిమా సక్సెస్ అయితే ‘తెలిసినవాళ్లు.. తెలియనివాళ్లు ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు’ అని సినిమా టీమ్ చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉండేది. వీళ్ల నంబర్ జనాలకు ఎలా తెలుసని నవ్వుకునేవాడిని. ఇప్పుడు దానికో లాజిక్ ఉందని అర్థమైంది. తాజాగా ఆ అనుభవం నాకు ఎదురైంది. చాలామంది ఫోన్ చేసి మెచ్చుకుంటున్నారు. సినిమా చూసి సుకుమార్, హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి, క్రిష్ వంటి దర్శకులు ఫోన్ చేసి కమర్షియల్ హిట్ కొట్టావ్ అన్నారు. అదొక గొప్ప జ్ఞాపకం.