ఇండస్ట్రీలో ఒక కుటుంబం నుంచి ఒక హీరో క్లిక్ అయిన తర్వాత అదే కుటుంబం నుంచి మిగతా హీరోలు రావడమనేది సహజం. సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఇండస్ట్రీలో అయినా అన్నయ్య లేదా తమ్ముడు క్లిక్ అయితే ఆ రంగంలోకి తోడబుట్టిన వాళ్ళని లాగేయడం అనేది మామూలే. చిరంజీవి పవన్, నాగబాబులని సపోర్ట్ చేసినట్టు.. విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండను ప్రోత్సహించినట్టు.. తమలానే తమ్మ వాళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఒక హీరో కుటుంబం నుంచి మిగతా హీరోలు వస్తుంటారు. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు, బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్ బాబు.. స్వాతిముత్యం అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది. అయితే అదే రోజున చిరంజీవి, నాగార్జున సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అసలే దసరా.. పండగ సీజన్ అంటే పెద్ద సినిమాల నిర్మాతలు ముందే రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుంటారు. పండగల్లో భారీగా కలెక్షన్లు రాబట్టాలని ప్రతీ నిర్మాతకూ ఉంటుంది. చిన్న నిర్మాతలైనా డబ్బులు పెట్టినోళ్లే కాబట్టి పండగలని క్యాష్ చేసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలోనే దసరా పండగ సీజన్ ని క్యాష్ చేసుకోవాలని స్వాతిముత్యం నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇదే అంశం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశం అవుతోంది. ఒక పక్క చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, మరోపక్క నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమాలు రిలీజ్ అవుతుంటే.. మధ్యలో స్వాతిముత్యంలా బెల్లంకొండ గణేష్ రావాలనుకోవడం వెనుక ఇంత ధైర్యం ఎక్కడదని మాట్లాడుకుంటున్నారు.
ఇదే విషయం గురించి ప్రస్తావించగా బెల్లంకొండ గణేష్ బాబు స్పందించారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చిరంజీవి, నాగార్జునలకు పోటీగా రావడం లేదని.. వాళ్ళతో పాటు కలిసి వస్తున్నానని వెల్లడించారు. దసరా పండగ తమకి కూడా ఎంతో స్పెషల్ అని, అందుకే ఆ రోజున స్వాతిముత్యం సినిమా రిలీజ్ చేస్తున్నామని అన్నారు. కంటెంట్ ఉండాలే గానీ పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అయినా కూడా చిన్న సినిమాని ప్రేక్షకులు హిట్ చేస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. ఒక మంచి సినిమాతో, దసరా పండగకి రావడం సంతోషంగా ఉందని బెల్లంకొండ గణేష్ బాబు అన్నారు.