గతేడాది నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా.. అద్భుతమైన విజయం సాధించింది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో ఇదివరకే సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ సినిమా.. ప్రేక్షకుల అంచనాలు అందుకొని కలెక్షన్స్ పరంగా రికార్డు సృష్టించింది. క్లాస్ తో మాస్ అంశాలు.. అఘోర క్యారెక్టరైజేషన్, దైవత్వం.. సామాజిక సందేశాలతో పాటు మంచి నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.
బాలయ్య కెరీర్ లోనే అఖండ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలవడం విశేషం. తాజాగా అఖండ సినిమాకి సీక్వెల్ ఉంటుందని చెప్పి సర్ప్రైజ్ చేశాడు బాలయ్య. ఈ ఏడాది జరుగుతున్న గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో అఖండ సినిమాని స్పెషల్ స్క్రీనింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత రవీందర్ రెడ్డిలతో పాటు బాలయ్య కూడా ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అఖండ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు బాలయ్య. ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
ఇంతలో అఖండ 2 గురించి చెప్పేసరికి.. మరోసారి బోయపాటి – బాలయ్య కాంబోని తెరపై చూడబోతున్నామని నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోవా ఫిలిం ఫెస్టివల్ లో అఖండ సీక్వెల్ గురించి బాలయ్య మాట్లాడుతూ.. “అఖండ సినిమా సబ్జెక్టు ఒక ప్రాంతానికి, రాష్ట్రానికి పరిమితమైంది కాదు. అఖండ 2కి సబ్జెక్టు లాక్ చేసి పెట్టాం. మా నిర్మాత, దర్శకుడు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు అఖండ సీక్వెల్ చేసేస్తాం. అందుకే సినిమాలో ఓ పాయింట్ ని రివీల్ చేయకుండా ఉంచాం.” అని చెప్పుకొచ్చాడు బాలయ్య. అయితే.. ఇదే అఖండ సీక్వెల్ పై దర్శకుడు బోయపాటి కూడా గతంలో లైన్ రెడీగా ఉందని తెలిపాడు. చూడాలి మరి.. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ కాంబో.. అఖండ 2 త్వరలో అనౌన్స్ చేస్తారేమో!