ఈ ఏడాది బిగ్ సక్సెస్ అందుకున్న చిన్న సినిమాలలో ‘డీజే టిల్లు’ ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ హీరో కం రైటర్ గా చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. ఊహించని కలెక్షన్స్ రాబట్టింది. రొమాంటిక్ క్రైమ్ కామెడీ సినిమాగా తెరకెక్కిన డీజే టిల్లు మూవీతో హీరో సిద్ధు జొన్నలగడ్డ తన పూర్తి టాలెంట్ ని తెరపై చూపించేశాడు. అయితే.. ఈ మధ్య సక్సెస్ అయిన సినిమాలన్నింటికీ సీక్వెల్స్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అదే బాటలో డీజే టిల్లు-2 కూడా రాబోతుంది. కొద్దిరోజుల క్రితమే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమాలో హీరో సిద్ధు సరసన అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్ చేయనుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
తాజాగా సమాచారం ప్రకారం.. డీజే టిల్లు 2 నుండి హీరోయిన్ అనుపమ తప్పుకున్నట్లు తెలుస్తోంది. డీజే టిల్లు సీక్వెల్ మొదలయ్యే ముందే దర్శకుడు విమల్ కృష్ణ.. ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఇక హీరోయిన్ గా మొదటి భాగంలో నేహా శెట్టి నటించింది. ఆమె స్థానంలో సీక్వెల్ కోసం అనుపమ పరమేశ్వరన్ ని అనౌన్స్ చేశారు. రీసెంట్ గా షూట్ కూడా స్టార్ట్ చేశారు. కానీ.. ఇంతలో ఏమైందోగానీ.. డీజే టిల్లు 2 ప్రాజెక్ట్ నుండి అనుపమ బయటికి వచ్చేసిందని వార్తలు మొదలైపోయాయి. ఇందులో ఎంతవరకు నిజముంది అనేది క్లారిటీ రావాల్సి ఉండగా.. స్క్రిప్ట్ లోని డైలాగ్స్ కారణంగానే అనుపమ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని సినీవర్గాల టాక్.
ఇదిలా ఉండగా.. డీజే టిల్లు 2 సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. అనుపమ ప్లేస్ లో ఏ హీరోయిన్ ని తీసుకోబోతున్నారు..? అనంటే.. ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ మూవీస్ ఫేమ్ మడోనా సెబాస్టియన్ ని ఖరారు చేశారట మేకర్స్. మరో విషయం ఏంటంటే.. ప్రేమమ్ సినిమాతోనే అనుపమ, మడోనా ఇద్దరూ హీరోయిన్స్ గా తెలుగులో డెబ్యూ చేశారు. మరి ఆ సినిమాలో కూడా హీరో లైఫ్ నుండి ముందు అనుపమ వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత మడోనా ఎంటర్ అవుతుంది. సేమ్ ఆ సినిమాలో జరిగిందే.. ఇప్పుడు డీజే టిల్లు విషయంలో రియల్ గా జరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి త్వరలో అధికారిక ప్రకటన రానుందేమో!