టాలీవుడ్ నటుడు, రియల్ హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎలాంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటారు. హీరోగా నటించిన ఆయన ప్రస్తుతం ఎలాంటి క్యారెక్టర్ పాత్రలకైనా సై అంటున్నారు. ఆ మద్య కొన్ని చిత్రాల్లో విలన్ గా కూడా నటించారు.
నెల్లూరులో గౌడ కల్లు గీత పారిశ్రామిక సంఘం, గౌడ సేవా సమితి ట్రస్ట్ సమావేశానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు సుమన్. తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని వేరే వాటిపై దృష్టి పెట్టె ఖాళీ లేదని అన్నారు. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఎల్లవేళలా అందుబాటులోకి ఉండడం వీలుకాదు.. దీంతో ఆ పోస్టుకి నేను సరైన న్యాయం చేయలేనని ఉద్దేశ్యంతోనే పోటీ చేయడంలేదని చెప్పారు. రెండు పడవలపై కాలు పెట్టి ప్రయాణం చేయడం మంచిది కాదు అన్నారు.
టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు విషయంలో స్పందించిన సుమన్.. డ్రగ్స్ ఒక్క సినీ ఫీల్డ్ లోనే కాదు అన్ని చోట్ల ఉన్నాయని చెప్పారు. అయితే ఈ విషయాలు ఎక్కువగా వెలుగులోకి రాకపోవడం శోచనీయం అన్నారు. కాకపోతే సెలబ్రిటీలు, సినీ గ్లామర్పై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళే ఎక్కువ పబ్లిసిటీ అవుతారని తెలిపారు. విదేశాల్లో ఉన్నట్లు కఠిన శిక్షలు మన దేశంలోనూ ఉంటే డ్రగ్స్ వ్యవహారం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంతో మంది యువత డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారని.. అలాంటి వారికి వెంటనే కఠిన శిక్ష అమలు పరిచాలని అన్నారు.