టాలీవుడ్ పరిశ్రమలో వరుసగా సినీ ప్రముఖులు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేని అస్వస్థతకు గురవ్వగా.. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా మరో నటుడు ఆసుపత్రిలో చేరారు.
వరుసగా సినీ ప్రముఖులు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు చేరుతున్నారు. టాలీవుడ్లోని బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేని అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. తాజాగా సీనియర్ నటుడు శరత్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన అనారోగ్య సమస్యలతో కొంత కాలంగా బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉండి ట్రీట్ మెంట్ తీసుకున్నారు. బెంగళూరు ఆసుపత్రిలో ఆయన కొంత వరకు కోలుకున్నారని ఆయన సన్నిహితులు ప్రకటించారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను శుక్రవారం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుప్రతికి తరలించారు.
ప్రస్తుతం ఆయన పరిస్థితికి నిలకడగా ఉందని తెలుస్తోంది. ఆయనను ఐసీయూ నుండి జనరల్ రూమ్ కు షిఫ్ట్ చేశామని డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలిసి శరత్ బాబు అభిమానులు కాస్త కుదుటపడ్డారు. దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించారు శరత్ బాబు. తెలుగు సినిమాలతో మొదలు పెట్టి.. తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో శరత్ బాబు లీడ్ క్యారెక్టర్లు చేశారు. 1973లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శరత్ బాబు ఇప్పటి వరకు 220కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 1981, 1988, 1989 సంవత్సరాలలో మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలను అందుకున్నారు. కాగా, ఆయన నరేష్, పవిత్ర జంటగా నటిస్తున్న మళ్లీ పెళ్లి సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.