తీవ్ర అస్వస్థతకు గురైన ప్రముఖ నటుడు శరత్ బాబు శుక్రవారం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన హెల్త్ అప్ డేట్ గురించి వైద్యులు వెల్లడించారు. శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు (71) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. శరత్ బాబును ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. బెంగళూరు ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేయడంతో కొంతవరకూ కోలుకున్న శరత్ బాబును మెరుగైన వైద్యం కోసం శుక్రవారం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించిందని డాక్టర్లు చెబుతున్నారు. ఆయన శరీరం మొత్తానికి ఇన్ఫెక్షన్ వ్యాపించిందని వైద్యులు తెలిపారు.
ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయవాలు పాడైనట్లు వైద్యులు వెల్లడించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి దారి తీసే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం శరత్ బాబును వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొన్ని గంటలు గడిస్తేనే గానీ పరిస్థితి గురించి చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. ఈరోజు సాయంత్రం శరత్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని సన్నిహితులు చెబుతున్నారు. కాగా శరత్ బాబు 1973లో వచ్చిన రామరాజ్యం సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టారు. తమిళ, కన్నడ, తెలుగు సినీ పరిశ్రమల్లో 200కి పైగా సినిమాల్లో నటించారు. హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించారు.
1981, 88, 89 సంవత్సరాలలో వరుసగా మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డులు అందుకున్న శరత్ బాబు మళ్ళీ పెళ్లి సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా బాబు చేస్తున్న తరుణంలో అనారోగ్యం కారణంగా శరత్ బాబు ఆసుపత్రి పాలయ్యారు. ఆయన త్వరగా కోలుకుని ఇంటికి క్షేమంగా చేరుకోవాలని భగవంతుడ్ని ప్రార్ధిద్దాం.