థియేట్రికల్ రిలీజ్ సమయంలో సినిమాలు క్లాష్ అవ్వడం అనేది ఇండస్ట్రీలో చాలా కామన్. ఓ పెద్ద సినిమాతో పాటు మిగతావి చిన్న సినిమాలు వస్తే.. ఆ లెక్క వేరేలా ఉంటుంది. అటు ఫ్యాన్స్ లో, ఇటు మేకర్స్ లో టెన్షన్ తక్కువగా ఉంటుంది. కానీ ఓ స్టార్ హీరో సినిమాతో పాటు మరో స్టార్ హీరో సినిమా వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా టెన్షన్ వేరే లెవెల్లో ఉంటుంది.
ఈ ఫిబ్రవరి 25న మిగతా ఇండస్ట్రీల పరిస్థితి ఏమోగానీ టాలీవుడ్ లో మాత్రం రచ్చ జరగబోతుందని అర్థమవుతుంది. ఎందుకంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్‘ సినిమా ఫిబ్రవరి 25న భారీగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. రానా, నిత్యామీనన్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలలో కనిపించనున్న ఈ సినిమా.. భారీ అంచనాలతో, అడ్వాన్స్ బుకింగ్ రికార్డులతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక భీమ్లా నాయక్ కి ముందురోజు.. ఫిబ్రవరి 24న తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన త్రిభాషా చిత్రం ‘వలిమై‘ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి ట్రైలర్ కూడా విడుదలై సినిమా పై అంచనాలు పెంచింది. కానీ మొన్నటివరకూ భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న వస్తుందనే క్లారిటీ రాకపోవడంతో వలిమై మేకర్స్.. తెలుగులో పోటీగా పెద్ద సినిమాలు లేవని హ్యాపీ అయ్యారు.
ఒక్కసారిగా భీమ్లా నాయక్ డేట్ ఫిక్స్ అయ్యేసరికి షాక్ అయ్యానంటున్నాడు.. టాలీవుడ్ యువహీరో, ‘వలిమై’ విలన్ కార్తికేయ. తాజాగా భీమ్లా నాయక్ రిలీజ్ పై స్పందించిన కార్తికేయ.. ‘భీమ్లా నాయక్ ఫిబ్రవరి రిలీజ్ డేట్ రాగానే షాకయ్యాను. కానీ ఓరోజు ముందుగానే వలిమై వస్తోంది. కాబట్టి, భీమ్లా నాయక్ తర్వాత ప్రేక్షకులకు సెకండ్ ఆప్షన్ గా మా సినిమా చూడొచ్చు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కార్తికేయ వీడియో వైరల్ అవుతోంది. మరి భీమ్లా నాయక్ – వలిమై సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.