శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మించారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు ప్రేక్షకులు నుండి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమంటూ మంచి టాక్ వినిపిస్తోంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ శనివారం(మార్చి 5) రామానాయుడు స్టూడియోలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఆడవాళ్ళు మీకు జోహార్లు సినేమా విజయంపై.. రష్మిక మాట్లాడుతూ, నేను ముందుగా చెప్పినట్లుగా విడుదల రోజు మా అమ్మ నాన్న థియేటర్లో సినిమా చూశారు. ఇలాంటి ఒక మంచి సినిమా రావడానికి చాలా కాలం పట్టిందని తెలిపారు. ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ను వారు వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. మన కుటుంబంలోని వ్యక్తులు ఈ సినిమాలోని పాత్రలు ద్వారా మన కళ్ళ ముందు కనిపిస్తారు. నిన్న కొన్ని థియేటర్లకు వెళ్ళాం. అక్కడ అంతా ఫ్యామిలీ తోనే సినిమాకు వచ్చారు. వచ్చే వారం కూడా మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకముందని తెలిపారు.
ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. మేం విడుదలకు ముందు ఏదైతే అనుకున్నామో అది నేడు జరిగింది. చాలా సంతోషంగా వుంది. నా కుటుంబసభ్యులుతో పాటు స్నేహితులు కూడా సినిమా చూసి బాగుందన్నారు. ఇది బాగోలేదని ఒక్కరూ కూడా అనడం నేను వినలేదు. మన ఇంటిలో జరిగే కథలా వుంటుంది. మేం నవ్విస్తామని చెప్పాం. అలాగే థియేటర్లలో ప్రేక్షకులు నవ్వుతూనే వున్నారు. చాలా రోజుల తర్వాత థియేటర్కు వచ్చినప్పటికి.. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామని ప్రేక్షకులు చెబుతున్నారని అన్నారు.