భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రాత పరీక్ష లేకుండానే మెరిట్ ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 57 టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఖాళీల భర్తీకి ఎలాంటి టెస్టుగానీ, ఎంట్రన్స్ గానీ ఉండదు. కేవలం అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగానే ఈ ఖాళీల భర్తీ ఉంటుంది. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్ స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ డిప్లామా పొంది ఉండాలి. ఆ డిప్లొమాలో కనీసం 60 శాతం మార్కుల కంటే ఎక్కువ సాధించి ఉండాలి. 2020, 2021, 2022 సంవత్సరాల్లో డిప్లొమా పూర్తి చేసుకున్న వాళ్లు ఈ నోటిఫికేషన్ కు అర్హులుగా తెలిపారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థికి అక్టోబర్ 1, 2022 నాటికి వయసు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అలా చూసుకుంటే అభ్యర్థి అక్టోబర్ 1, 1995 నుంచి అక్టోబర్ 1, 2004 మధ్య సంవత్సరాల్లో జన్మించిన వారు అయిఉండాలి. వారికి మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేయవచ్చు. అక్టోబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసి అందులో అవకాశం దక్కించుకున్న వారికి నెల నెలా రూ.18 వేల వరకు స్టైఫండ్ గా చెల్లిస్తారని వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 57 ఖాళీలు ఉన్నాయి. వాటిలో కెమికల్ ఇంజినీరింగ్ వారి కోసం 40 పోస్టులు, మెకానికల్ ఇంజినీరింగ్ వారికి 6 పోస్టులు, ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ చేసిన వారికి 6 ఖాళీలు, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన వారికి 5 ఖాళీలు ఉన్నాయి.