ప్రభుత్వ ఉద్యోగాల సాధించాలని ఎందరో యువత ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు. సర్కారి జాబ్ వస్తే తమ జీవితమే మారిపోతుందని భావిస్తారు. ఎప్పుడెప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నోటిఫికేషన్ వస్తుందా? జాబ్ కొట్టేయాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటారు. తాజాగా నిరుద్యోగులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం డిగ్రీ అర్హతతో వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించింది. ఇంతకి ఆ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఏమిటో, ఎలా అప్లయ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్)పరీక్ష-2022కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పరీక్షలు నిర్వహించి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీగా ఉన్న 20,000 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైర్-1, టైర్-2 పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ (కామర్స్/ ఎకనామిక్స్/ బిజినెస్ స్టడీస్)/ ఎంబీఏ (ఫైనాన్స్)లు విద్యార్హతగా కలిగి ఉండాలి. ఇక వయోపరిమితి విషయానికి వచ్చేసరికి.. 01.01.2022 నాటికి పోస్టుల బట్టి 18-27, 20-30, 18-30, 18-32 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో రూ.100ను ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.