చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరోమారు ఐపీఎల్ ఫైనల్స్కు చేరుకుంది. దీనికి అందరి కంటే ఎక్కువ క్రెడిట్ ఆ టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇవ్వాల్సిందే. అయితే ఎప్పుడూ కూల్గా కనిపించే ధోని.. ఒక సందర్భంలో భావోద్వేగానికి గురయ్యాడట.
క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఎంఎస్ ధోని ఒకడు. టీమిండియాకు సారథిగా ఎన్నో విజయాలు అందించాడు మాహీ. టీ20, వన్డే వరల్డ్ కప్లను అందించి.. మొత్తం భారతావనిని ఆనందంలో ముంచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అయితే ధోనీని మించిన కెప్టెన్ లేడనే చెప్పాలి. ఐపీఎల్లో మరోమారు చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్స్కు చేరడంలో సారథిగా కీలక పాత్ర పోషించాడు. ఎంత ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా ఉంటూ, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ధోనీకే సాధ్యం. మ్యాచ్ పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు నయా వ్యూహాలు రచించడం, ప్రత్యర్థులను బోల్తా కొట్టించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి. అయితే గ్రౌండ్లో కాస్త సీరియస్గా కనిపించే ధోని.. చాలా ఎమోషనల్ అని పలువురు చెబుతుంటారు. అతడు అందరితో సరదాగా ఉంటాడని అంటుంటారు.
తాజాగా ధోని గురించి టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కేకు తాను ఆడిన రోజులను గుర్తు చేసుకున్న భజ్జీ.. ఒక సందర్భంలో ధోని బాగా ఎమోషనల్ అయ్యాడని ఓ స్పోర్ట్స్ ఛానల్ షోలో మాట్లాడుతూ బయటపెట్టాడు. రెండు సంవత్సరాల నిషేధం తర్వాత 2018లో చెన్నై జట్టు ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఈ ఘటన జరిగిందన్నాడు. ఆ రోజు రాత్రి టీమ్ డిన్నర్లో ధోని కన్నీళ్లు పెట్టుకున్నాడని హర్భజన్ చెప్పుకొచ్చాడు. అతడు భావోద్వేగానికి గురయ్యాడని.. ఇది చాలా మందికి తెలియదన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో సీఎస్కే మాజీ ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ కూడా ఇది నిజమేనన్నాడు. ఆ రోజు ధోని చాలా ఎమోషనల్ అయ్యాడని.. అతడు టీమ్ను తన కుటుంబంలా భావిస్తాడని తాహిర్ పేర్కొన్నాడు. ఇకపోతే, 2018 సీజన్లో పునరాగమనం చేసిన సీఎస్కేని అందరూ డాడీస్ ఆర్మీ అంటూ హేళన చేశారు. కానీ ఆ టీమ్ అందరికీ షాక్ ఇస్తూ ట్రోఫీని ఎగరేసుకుపోయింది.