తరచుగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి అంటే మనలో రోగ నిరోధక శక్తి తగ్గిందని అర్ధం. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి మన ఇంట్లో ఉండే వంట దినుసులనే ఉపయోగించుకోవచ్చు. వంటింటి దినుసుల్లో ఒక ముఖ్యమైన దినుసు మిరియాలు. అయితే.., మిరియాల్ని అందరూ వంటల్లో ఒక పదార్ధంగా వాడతారు తప్ప.. దానిలో ఉండే ఔషధ గుణాల గురించి గానీ, దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి గానీ చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ ప్రయోజనాలేంటో చూద్దాం.
ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో ఒక చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపి తాగుతూ ఉండాలి. అయితే.., ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఖాళీ కడుపుతో ఈ రసం తాగుతున్నాం కాబట్టి మిరియాలు ఘాటు పదార్ధం కాబట్టి ఈ మిరియాల పొడి ఒక చిటికెడు మాత్రమే తీసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకుంటే ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది.
ఈ మిరియాల నీటి వల్ల ఎన్నో రకాల ఉపయోగాలున్నాయి.వాటిలో ముఖ్యమైనది రోగ నిరోధక శక్తి పెంపుదల. మిరియాల నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనుకోకుండా వచ్చే ఆరోగ్య సమస్యల పై పోరాడడానికి అవసరమైన ఇమ్యూనిటీని ఈ మిరియాల నీళ్లు మనకి అందిస్తాయి. అలాగే, మిరియాల నీటి వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే హానికారక వ్యర్ధాల నిర్మూలన. శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలను నిర్మూలించడంలో మిరియాల నీళ్లు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడి, పేగు సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంది.
ఇక, మిరియాల నీటితో చేకూరే మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే అధిక బరువు తగ్గడం. అధిక క్యాలరీలను ఖర్చయ్యేలా చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇక శరీరాన్ని తేమగా ఉంచడంలో మిరియాల నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో తోడ్పడి, కాంతివంతంగా కనిపిపించేలా చేస్తాయి. అదే విధంగా మల బద్దకాన్ని నివారించడంలో మిరియాల నీళ్లు ఉపయోగపడతాయి. దీర్ఘ కాలికంగా మల బద్దకంతో ఇబ్బందిపడేవారు ఈ మిరియాల నీళ్లు తీసుకోవడం ద్వారా సమస్య నుంచి బయటపడొచ్చు. జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యల నుంచి బయట పడడానికి మిరియాల నీళ్లు ఉపయోగపడతాయి. అందువల్ల మిరియాల నీటిని తాగడం అనేది మన రోజువారీ జీవన శైలిలో ఒక భాగంగా చేసుకుంటే చాలా మంచిది. ఇవి.. మిరియాల వల్ల లాభాలు.