చంద్రగ్రహణం ఈ నెల 8న వచ్చింది. సూర్య, చంద్రగ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకూడదు అని అంటూ ఉంటారు. ముఖ్యంగా చంద్ర గ్రహణ సమయంలో ఎలాంటి విధి, విధానాలు పాటించాలి అని మన పూర్వీకులు సూచించారు. అనాదిగా పూర్వీకులు చెప్పిన ఆచారాలను అనుసరిస్తూ వస్తున్నారు. సూర్యగ్రహణం అయినా, చంద్రగ్రహణం అయినా.. గ్రహణ సమయం కన్నా కనీసం 3 గంటల ముందు ఘన పదార్థాలు ఏమీ తినకుండా ఉండాలని అంటారు. చాలా మంది ఈ నియమం పాటిస్తారు. గ్రహణ సమయానికి కడుపులో ఏమీ ఉండకూడదనేది నియమం. గ్రహణం పట్టినప్పుడు, గ్రహణం వీడినప్పుడు కూడా స్నానం చేయాలి.
ఇల్లు శుభ్రం చేసుకుని, దేవుళ్ళకి పూజ చేసుకోవడం, ఆ తర్వాత వంట చేసుకోవడం అనేది గ్రహణాలన్నిటికీ పాటిస్తారు. ఇక గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం పదార్థాల మీద ఉంటుంది కాబట్టి ఆహార పదార్థాల మీద దర్భలు (గరికలు) వేసుకుంటారు. ఏ గ్రహణం అయినా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చంద్రగ్రహణం రోజున గర్భిణీలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంటారు. ఎందుకంటే అమావాస్య, పూర్ణిమ రోజులప్పుడు సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. నీటి మీద చంద్రుడి ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో 60 శాతం పైనే నీరు ఉంటుంది. అమావాస్య, పూర్ణిమ రోజులప్పుడు, గ్రహణ సమయంలో ఆ నీటిపై ప్రభావం ఉంటుంది.
గర్భస్థ శిశువు తల్లి కడుపులో ఉమ్మ నీటిలో ఉంటాడు. కాబట్టి ఆ నీటిపై గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలని అంటారు. ఈ విషయాలు మనకి తెలిసినవే. అయితే ఇవి కాకుండా గ్రహణం రోజున ఒక పని చేస్తే పేదరికం పోయి ఐశ్వర్యం, రాజభోగ్యం సిద్ధిస్తాయని అంటున్నారు. గ్రహణం విడిచి తర్వాత ఇంటికి సమీపంలో నది ఉంటే ఆ నదిలో తల స్నానం చేసొచ్చి.. ఇష్టదైవాన్ని పూజించుకోవాలి. నది లేకపోతే ఇంట్లో తల స్నానం చేసి ఇష్ట దైవాన్ని పూజించుకోవాలి.
ముఖ్యంగా చంద్రగ్రహణం రోజున శివుడ్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు. గ్రహణం విడిచిన తర్వాత శివ పంచాక్షరీ మంత్రం జపిస్తే శుభం కలుగుతుంది. అలానే గ్రహణం ఏర్పడిన 11 రోజుల లోపు శివాలయంలో రుద్రాభిషేకం చేస్తే దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. బియ్యం, ఉలవలు, వెండి చంద్రబింబం, నాగ పడగలు వంటివి బ్రాహ్మణులకు దానం ఇస్తే మంచిదని.. దానం చేయడం వల్ల గ్రహ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.