రోజూ కాసేపు సూర్యకిరణాల ఎదురుగా గడిపినా చాలు. శరీరానికి అవసరమైన డి విటమిన్ అంది అనారోగ్యం దరిచేరదు. సూర్యభగవానుడు అన్ని జీవుల పట్ల సమృదృష్టి కలిగినవాడు. ఆరోగ్యప్రదాత. సూర్యుడు లేనిదే చెట్లు, మొక్కలు మున్నగు వృక్షజాతులు మనలేవు. అందుకే ఆయనకు మిత్రుడని పేరు. సకల ప్రాణులు సూర్యునిపైనే ఆధారపడి ఉన్నాయని రుగ్వేదం చెబుతోంది. అంతేగాక ఆయన ప్రత్యక్ష దైవం.
‘మిత్ర’, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర అనే ద్వాదశ నామాలతో సూర్యుడు అర్చించబడు తున్నాడు. సూర్యుని రథాన్ని లాగే గుర్రాలు ఏడు, సూర్య కిరణాల్లో రంగులు ఏడు. హనుమంతుడు, యాజ్ఞవల్క్యుడు సూర్యుని దగ్గరే వేదశాస్త్రాలు నేర్చారు. విజ్ఞాన శాస్త్రాలు సైతం సూర్యుడే విశ్వకర్త అని అంగీకరిస్తున్నాయి. సూర్యుడి పత్నులు సంజ్ఞ, ఛాయ. వారి పుత్రులు యముడు, వైవస్వతుడు, సావర్ణి, శని. పుత్రికల పేరు యమున, తపతి.
వనవాస కాలంలో పాండవులు సూర్యభగవానుడిని ఆరాధించి ఆయన నుంచి అక్షయపాత్రను పొందారు. అలాగే సత్రాజిత్తు సూర్యభగవానుని ప్రార్థించి శమంతకమణిని వరంగా పొందాడు. రామరావణ సంగ్రామంలో శ్రీరాముడు అగస్త్య మహర్షి సలహాతో ఆదిత్య హృదయాన్ని పఠించడంవల్ల రావణుడిపై విజయం సాధించినట్లు రామాయణ మహాకావ్యం పేర్కొంటుంది. ‘ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రువినాశనం’ అని వాల్మీకి మహర్షులవారు రామాయణ మహాకావ్యంలో వివరించారు.
రథసప్తమి పర్వదినం జరిగే రోజు ఏడవ తిథి. అందుకే స్వామి సప్తలోక ప్రదీపకుడు. సూర్యుడి రథం పేరు చిత్రరథం, కాబట్టి ఆయన్ను ‘చిత్రరథుడు’ అని పిలుస్తారు. చీకటంతా సూర్యోదయంతో పటాపంచలవుతుంది. ఈ రోజు ఆదిత్యారాధన, పారాయణ చేసి సూర్యభగవానుని దర్శనం చేసుకోవడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకం. రథసప్తమి పర్వదినాన మొదట సూర్యుని తల్లి అయిన గాయత్రిని ధ్యానించాలని ధర్మసింధువు బోధించింది.
సూర్యభగవానుడికి కనకాంబరాలు, ఎర్రచామంతి పువ్వులను సమర్పించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. సూర్యభగవానుడికి అనునిత్యం మూడు వేళలలోను అర్ఘ్యం వదిలి నమస్కరించడంవలన పాపాలు పటాపంచలై శుభాలు చేకూరుతాయి. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి, కోణార్క దేవాలయం తదితర సూర్యక్షేత్రాలలో ఈ వేళ విశేష పూజలు జరుగుతాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో రథసప్తమి సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు జరుపుతారు.
సూర్యుడు నమస్కార ప్రియుడు. సూర్య నమస్కారాలు చేయడంవల్ల శారీరక, మానసిక ఆధ్యాత్మిక రుగ్మతలు తొలగి, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎంత ధనం వ్యయం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, విద్యాబుద్ధులు ఒంటబట్టక నిరాశలో వున్నవారు సూర్యుని ప్రసన్నం చేసుకుంటే విద్యాభివృద్ధి కలుగుతుందని నవగ్రహ పురాణం చెబుతోంది. అందుకే అందరం రథసప్తమి వ్రతం ఆచరిద్దాం – ఆరోగ్యవంతులుగా ఉందాం.
అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు…
సూర్య నమస్కారముల గురించి మరిన్ని వివరాలకు ఈ వీడియో వీక్షించండి.