భారత దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి.. ఒక్కో ఆలయానికి ఒక్కో ఆచార, సాంప్రదాయాలు పాటిస్తుంటారు భక్తులు. దేవాలయాల్లో పూర్వీకులు పాటించే ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల ఆచారాలు చూడటానికి చాలా విచిత్రంగా ఉన్నా.. అలా చేస్తే భగవంతుడు తమను చల్లగా చూస్తారని భక్తుల నమ్మకం. ఓ ఆలయంలో భక్తులు ఆచారం చూస్తే నిజంగా నివ్వెరపోతారు. సాధారణంగా మనం ఏ దేవాలయానికి వెళ్లినా చెప్పులు, బూట్లు బయట వదిలి కాళ్లు కడుక్కోని మరీ గుడిలోకి ప్రవేశిస్తాం.. కానీ ఆ గుడిలో మాత్రం అమ్మవారికి చెప్పులు కానుకగా ఇస్తారు. వివరాల్లోకి వెళితే..
దేవాలయానికి వెళ్తే.. చెప్పులు బయట విప్పి వెళ్తారు. దేవుడికి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి… పండ్లు, ఫలాలు, నైవేద్యం సమర్పించి మొక్కుకుంటాం. కానీ కర్ణాటకలో మాత్రం ఒక ఆలయంలో భక్తులు అమ్మవారిని వింతైన ఆచారాలతో మొక్కుతారు. ఇక్కడ గోల లక్కమ్మ అమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది. ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత వచ్చే పంచమినాడు అమ్మవారికి ఘనంగా జాతర జరుగుతుంది. గోల లక్కమ్మ అమ్మవారిని కాళికా మాతకు మరో రూపంగా కొలుస్తుంటారు. అమ్మవారి వీపు చూస్తూ మొక్కుతారు.. తర్వాత కొత్త చెప్పులను కానుకగా సమర్పించి తమ కోరికలు తీర్చమని మొక్కుతారు.
ఇది అనాధిగా వస్తున్న ఆచారం అని.. అలా చేస్తే అమ్మవారి తాము కోరుకున్న కోరికలు తీర్చుతుందని భక్తుల నమ్మకం. ఈ గుడికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా భక్తులు దర్శనానికి వెళ్తుంటారు. అమ్మవారి వద్ద కొబ్బరికాయలు కొట్టి చెప్పులు కట్టి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. గతంలో ఇక్కడ ఎద్దులను అమ్మవారికి బలి ఇచ్చేవారని.. ఇది చట్ట విరుద్దమని ప్రభుత్వం చెప్పడంతో అప్పటి నుంచి మానివేశారని అంటుంటారు భక్తులు. ఏది ఏమైనా మన దేశంలో దేవాలయాల్లో రక రకాల ఆచారాలు పాటిస్తుంటారు.. అందులో ఇది చాలా విచిత్రమైన ఆచారం అంటున్నారు.