కాశీకి వెళ్తే కాయో- పండో వదిలి రావాలి అని పెద్దలు చెబుతుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. గంగలో కోరికచెప్పి ఏదైనా ఇష్టమైన వస్తువు వదిలి రావాలి అని కూడా వింటుంటారు. అయితే కాయో- పండో వదిలిరావాలా? అసలు పురాణాలు ఏం చెబుతున్నాయి? ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
దేశంలోని అత్యంత పుణ్య క్షేత్రాల్లో కాశీ కూడా ఒకటి. ఎందరో చనిపోయేలోపు ఒక్కసారైనా ఆ కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకోవాలని కోరుకుంటుంటారు. అలా కాశీకి వెళ్తే.. అక్కడ కాయో- పండో వదలి రావాలి అని చెబుతారు. అయితే పురణాల్లో ఎక్కడా కూడా కాయ- పండు వదిలి రావాలి అని చెప్పలేదు. గంగలో పుణ్యస్నానం ఆచరించి ‘కాయాపేక్ష, ఫలాపేక్షను వదిలి’ ఆ కాశీ విశ్వనాథుడ్ని దర్శించుకోవాలని పురణాలు చెబుతున్నాయి. అంటే కాయాపేక్ష(ఈ శరీరంపై మమకారాన్ని), ఫలాపేక్ష(కర్మ ఫలంపై ఆపేక్షను) వదిలి రావాలని తెలియజేశారు.
కాయాపేక్ష, ఫలాపేక్షను రానురాను కాయా- పండుగా మార్చేశారు. ఇప్పుడు అందరూ గంగలో మునిగి కాయా, పండు, చిల్లర డబ్బులు వదిలి మా జన్మ ధన్యం అయిపోయింది అని భ్రమ పడుతుంటారు. అయితే ఈ శరీరంపై ఆపేక్షను, కర్మ ఫలంపై ఆపేక్షను వదిలి స్వచ్ఛమైన మనస్సుతో ఆ శివయ్యను ఆరాధించాలని తెలియజేస్తున్నారు.