తల్లి నవమాసాలు బిడ్డను కడుపులో మోసి.. జన్మనిస్తుంది.. కానీ తండ్రి మాత్రం తాను బతికున్నంత వరకు బిడ్డలను గుండెల్లో మోస్తాడు.. వారి భవిష్యత్తు కోసం నిత్యం పరితపిస్తాడు.. అంటూ తండ్రి ప్రేమ గురించి గొప్పగా చెప్తారు. ఇక ఆడపిల్లల విషయంలో తండ్రి మరింత ప్రేమను చూపుతాడు.. తల్లిని కుమార్తెలో చూసుకుంటాడు. బిడ్డకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేందుకు తన శాయశక్తుల ప్రయత్నిస్తాడు. అయితే నేటి కాలంలో కొందరు కిరాతక తండ్రుల గురించి వార్తలు చదువుతుంటే.. మనిషా మృగమా అనే అనుమానం వస్తుంది. భార్య మీద కోసంతో పిల్లలను హింసించేవారు కూడా ఉన్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పిల్లల భవిష్యత్తు, కుటుంబ పోషణ గురించి ఆలోచించి.. మనసు చంపుకుని.. విదేశాలకు వెళ్లి పని చేసి డబ్బులు పంపిస్తోంది ఆ తల్లి.
భార్య దూరంగా ఉంది.. పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన తండ్రి వారి పాలిట కాలయముడయ్యాడు. విదేశాల్లో ఉన్న భార్య మీద అనుమానంతో.. అభంశుభం తెలియని పిల్లలను చిత్ర హింసలకు గురి చేయడమే కాక.. వాటిని వీడియోలు తీసి భార్యకు పంపి రాక్షసానందం పొందాడు ఆ కసాయి తండ్రి. ఆ వివరాలు..
ఈ దారుణ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పెంటపాడుకు చెందిన దావీదుకు ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి సంతానం ఉన్నారు. మద్యానికి అలవాటైన దావీదు.. పని పాటా లేకుండా అప్పులు చేస్తూ.. జల్సాలు చేసేవాడు. ఇక పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన దావీదు భార్య నిర్మల ఉపాధి నిమిత్తం.. కువైట్ వెళ్లింది. ఆమె సంపాదించిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేసేవాడు దావీదు. ఈ క్రమంలో అతడికి భార్యకు అనుమానం మొదలైంది. దాంతో నిర్మలతో నిత్యం గొడవపడేవాడు. కువైట్లో ఉండవద్దు.. ఇండియా రావాలన్నాడు.
అప్పుల భారం, బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించిన నిర్మల ఇండియా రాలేదు. దాంతో భార్య మీద విపరీతమైన కోపం పెంచుకున్న దావీదు.. ఆమె అందుబాటులో లేకపోవడంతో.. ఆ ప్రతాపాన్ని అభంశుభం తెలియని బిడ్డల మీద చూపించడం ప్రారంభించాడు. పిల్లలను చిత్ర హింసలకు గురి చేస్తూ.. ఆ వీడియోలను భార్యకు పంపి బెదిరించేవాడు. ఈక్రమంలో నాలుగు రోజుల క్రితం మద్యం మత్తులో ఇంటికి చేరిన దావీదు.. భార్య మీద కోపంతో మృగంలా మారాడు. పిల్లలపై విరుచుకుపడ్డాడు. తమను కొట్టవద్దంటూ ప్రాధేయపడ్డా అతడి రాతి హృదయం కరగలేదు.
పైగా.. ఓ చిన్నారి కాళ్లు పట్టుకుని పైకి లేపి నేలపై విసిరేశాడు. చేతిలో కత్తి తీసుకుని భార్యను బూతులు తిడుతూ.. పిల్లలను చంపుతానంటూ బెదిరించసాగాడు. ఈ వీడియోను భార్యకు పంపి.. ఇండియా రాకపోతే పిల్లలను చంపుతానని బెదిరించాడు. ఈ వీడియోలను పెంటపాడు పోలీసులకు పంపింది తల్లి నిర్మల. తన బిడ్డలన్ని కసాయి తండ్రి బారి నుంచి రక్షించాలని పోలీసులను కోరింది.
వీడియోలు చూసిన పోలీసులు.. పెంటపాడు వెళ్లి.. చిన్నారులను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. నిందితుడు దావీదు రాజుపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న దావీదు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్కావడంతో.. కసాయి తండ్రిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాడేపల్లిగూడెం పెంటపాడులో ఒక దుర్మార్గపు తండ్రి తన ఇద్దరు కూతుళ్లని అత్యంత దారుణంగా కొడుతున్నాడు.. తల్లి ఉపాధి కోఆం దుబాయ్ వెళ్తే తండ్రి ఆ పిల్లల్ని ఇలా కొడుతున్నాడు.. ఆ పిల్లల్ని కాపాడమని వేడుకుంటున్నాను @urstrulyMahesh @dgpapofficial @tanetivanita @SRKRSajjala pic.twitter.com/Iq31aHUxbj
— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) September 15, 2022