వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ అవినాష్ రెడ్డి తన బెయిల్ పిటిషన్లో పలు కీలక విషయాలను వెల్లడించారు. సునీతే కుట్ర చేసిందని పేర్కొన్నారు.
మాజీ ఎంపీ, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి తన ముందస్తు బెయిల్ పిటిషన్లో పలు కీలక విషయాలను పేర్కొన్నారు. ఏంపీ అవినాష్ రెడ్డి తన పిటిషన్లో.. ‘‘ స్థానిక ఎమ్మెల్సీ ద్వారా ఏపీ ప్రతిపక్ష నేతతో కలిసి వైఎస్ సునీత కుట్ర చేశారు. సునీతకు వివేకానందరెడ్డి రెండో భార్యకు మధ్య విభేదాలు ఉన్నాయి. నిందితుడు సునీల్ యాదవ్తో పాటు ఉమాశంకరరెడ్డి భార్యతోనూ వివేకాకు వివాహేతర సంబంధాలు ఉన్నాయి.
వివేకానంద రెడ్డి హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వివేకానందరెడ్డి తన రెండో భార్య కుమారుడికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీట్ ఇప్పిస్తానని హమీ ఇచ్చాడు. స్కూల్ పక్కనే విల్లా కొనేందుకు ప్లాన్ చేశాడు. రెండో భార్య కుటుంబానికి డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని వివేకా భావించారు. ఇదంతా సునీతకు తెలిసింది. అందుకే వైఎస్ వివేకానందరెడ్డిని చంపించింది’’ అని పేర్కొన్నారు. ఇక, సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ అవినాష్రెడ్డి సీబీఐ కార్యాలయం ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. కాగా, రెండు రోజుల క్రితం అవినాష్ రెడ్డి అనుచరుడు అయిన గజ్జల ఉదయ్ కుమార్రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సాక్ష్యాలను టాంపరింగ్ చేశారన్న ఆరోపణలో ఆయన్ని అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం పులివెందుల్లో భాస్కర్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.