కొడుకులు తప్పు చేస్తే సర్దిచెప్పాల్సిన తండ్రే చేయకూడని తప్పుచేశాడు. ఇంతటితో ఆగకుండా ఇది తప్పు అని అడ్డు చెప్పిన కొడుకునే తండ్రి అన్నంలో విషం పెట్టి చంపబోయాడు. ఇదే వార్త ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు తండ్రి కన్న కొడుకుని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది. అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం ఎన్కతల. ఇదే గ్రామంలో ఉప్పరి పెంటయ్య, గోవిందమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు.
కొడుకులను ప్రయోజకులుగా తీర్చుదిద్దాల్సిన తండ్రి పెంటయ్య కుటుంబాన్ని పూర్తిగా పట్టించుకోవడమే మానేశాడు. ఇక భార్య గోవిందమ్మ కుటుంబ భారాన్ని భుజాన వేసుకుని ఉన్న ఐదు ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ సంసారాన్ని నెట్టుకొస్తుంది. అయితే ఈ రోజుల్లో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో పెంటయ్య కొంత భూమిని అమ్మాలనుకున్నాడు. కానీ కుమారులు మాత్రం.. గుంట భూమిని కూడా అమ్మేది లేదంటూ తండ్రికి తెగేసి చెప్పారు. కానీ పెంటయ్య మాత్రం ఖచ్చితంగా భూమిని అమ్మాల్సిందే అంటూ పట్టుబట్టి కూర్చున్నాడు.
పైగా కొడుకులు ఆ విషయంలో తండ్రికి విరుద్దంగా ఉండడంతో పెంటయ్య దుర్మార్గమైన ఆలోచనలు చేశాడు. ఎలాగైన నా పెద్ద కుమారుడిని హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే ఈ నెల 24న రాత్రి తన కుమారుడు తినే ఆహారంలో విషం కలిపి పెట్టాడు. అది తెలియని అతని కుమారుడు విషం కలిపిన ఆహారాన్ని తినేశాడు. తిన్న కొద్దిసేపటికి ఆ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికత్స అందించగా, విషం కలిపిన ఆహారం తిన్న కారణంగా ఇలా జరిగిందంటూ వైద్యులు తెలిపారు.
ఈ వార్త తెలుసుకున్న భార్య గోవిందమ్మ భర్తపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెంటయ్యను విచారించగా.., అసలు విషయం వెళ్లగక్కాడు. అనంతరం పోలీసులు నిందితుడు పెంటయ్య అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతని కుమారుడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.