రానురాను కొత్త తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయి. కొందరు ప్రేమ పేరుతో మోసం చేస్తుంటే.. ఇంకొందరు స్నేహితులుగా నటిస్తూ మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి ఎంత కిలాడీ అంటే ఒంటరి మహిళలే టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు ఇతనిపై మొత్తం 20 కేసులు ఉన్నాయి. ఇప్పటికే చాలాసార్లు జైలు జీవితం గడిపినా మార్పు రాలేదు.
ఇతను ఏపీలో దాదాపు 12 ఏళ్లుగా మోసాలకు పాల్పడుతున్నాడు. ఇతనికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీసు కమిషనర్ విశాల్ గున్నీ వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నెల్లూరు జిల్లా కోట మండలానికి చెందిన చేవూరి చంద్ర అలియాస్ వెందేటి చంద్ర చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరంగా గడపడం మొదలు పెట్టాడు. ఒంటరి జీవితానికి అలవాటు పడిన చంద్ర గూడూరు, తిరుపతిలో ప్రైవేటు ఉద్యోగాలు చేశాడు.
తిరుపతిలో ఉన్నప్పుడే మోసాలకు అలవాటు పడ్డాడు. తిరుపతి బస్టాండ్ చుట్టుపక్కల ఒంటరిగా జీవించే మహిళలతో పరిచయాలు పెంచుకునేవాడు. వారితో చనువుగా మెలుగుతూ స్థానిక హోటళ్లకు తీసుకెళ్లేవాడు. ముందుగానే తెచ్చుకున్న నిద్ర మాత్రలను ఇచ్చి వారి వద్దనున్న బంగారం, నగదు దోచుకుని పరారయ్యేవాడు. అలా 2010 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తిరుపతి, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, ఏలూరు పోలీస్ స్టేషన్లలో 20 కేసులు నమోదు అయ్యాయి.
ఈ జనవరిలో జైలు నుంచి బయటకు వచ్చిన చంద్ర విజయవాడ భవానీపురం మహిళతో చనువుగా మెలిగి ఆమె నుంచి 36 గ్రాముల బంగారం కాజేశాడు. ఆ తర్వాత జులై నెలలో కృష్ణలంకకు చెందిన మరో మహిళ నుంచి 61 గ్రాముల బంగారం అపహరించాడు. కృష్ణలంకకు చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అసలు కథ బయటకు వచ్చింది. నిందితుడిని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 97.5 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ దాదాపు రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.