ఈ మధ్య కాలంలో సైకో ప్రేమికుల ఆగడాలు ఎక్కువయిపోయాయి. తమ సైకోయిజాన్ని ప్రియురాళ్లపై చూపిస్తున్నారు. తాజాగా, ఓ సైకో ప్రియుడు తన ప్రియురాలికి దారుణమైన పరీక్ష పెట్టాడు. తన పేరును ఆమె ప్రైవేట్ పార్టుపై బ్లేడుతో పచ్చ పొడిపించుకునేలా చేశాడు. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తండ్రికి పంపాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్లోని మాల్స్ గహ్డాన్ భవానిపూర్కు చెందిన అవేంద్ర సోన్వానికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం అయింది. కొన్ని రోజులు వీళ్లు ఇద్దరూ ఫోన్లో బాగా మాట్లాడుకునేవారు. ఇద్దరి అభిరుచులు కలవటంతో ప్రేమలో పడ్డారు. కొన్ని నెలలు వీరి ప్రేమ ఎంతో చక్కగా నడిచింది.
ఈ నేపథ్యంలోనే ఇద్దరూ సహజీవనం చేయటం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు తీసి తన దగ్గర ఉంచుకున్నాడు. ఆ తర్వాత కొంత కాలానికి ఆమెకు నర్సు ఉద్యోగం వచ్చింది. దీంతో ఆమె తన ఇంటికి వెళ్లిపోయింది. అయినప్పటికి ఇద్దరూ తరచుగా కలిసేవారు. సంవత్సరాలు గడుస్తుండటంతో ఆమె తనను పెళ్లి చేసుకోవాలని అవేంద్రను అడిగింది. అయితే, ఇందుకు అతడు ఒప్పుకోలేదు. కొన్ని రోజుల పాటు ఆమె అతడిపై ఒత్తిడి తెచ్చింది. దీంతో అవేంద్ర ఆమెకు ఓ పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష పాస్ అయితే పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆమె అందుకు సరేనంది. అప్పుడు ఆమె ఏం చేయాలో అతడు చెప్పాడు. ఆమె ప్రైవేట్ పార్టుపై బ్లేడుతో తన పేరు రాసుకోమని అన్నాడు.
ప్రియుడితో పెళ్లి కోసం ఆమె కష్టాన్ని భరించింది. రక్తం కారుతున్నా ప్రైవేట్ పార్టుపై బ్లేడుతో అతడి పేరు రాసుకుంది. వీడియో కాల్లోనే ఇదంతా జరిగింది. బ్లేడుతో కోసుకోవటం వల్ల ఆమెకు గాయం అయింది. ఆ గాయం కారణంగా ఆమె పరిస్థితి విషమించింది. ఆసుపత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స చేయించుకుని బయటపడింది. అయితే, ప్రియురాలు బ్లేడుతో తన పేరు రాసుకున్న దృశ్యాలను ఆ రాక్షసుడు వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియోను ఆమె తండ్రికి పంపాడు. అది చూసి ఆయన షాక్ తిన్నాడు. అవేంద్ర అంతటితో ఆగలేదు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్గా మార్చాడు. ఈ నేపథ్యంలోనే బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.