ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ దత్త పుత్రిక తన తండ్రిని కట్టేసి దారుణంగా కొట్టి చంపింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లోని వైశాలి అపార్ట్ మెంట్స్ లో అనిల్ సక్సేనా(58) అనే వ్యక్తి భార్యతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే ఈ దంపతులకు పిల్లలు కలగకపోవడంతో 14 ఏళ్ల క్రితం ఓ చిన్నారిని దత్తత తెచ్చుకుని పెంచుకున్నారు. పిల్లలు లేకపోవడంతో అనిల్ దంపతులు ఆ పాపను ఎంతో ఇష్టంగా పెంచుకున్నారు.
ఆ చిన్నారి ఇప్పుడు పెరిగి పెద్దదై 14 ఏళ్ల వయసుకొచ్చింది. ప్రస్తుతం ఆ బాలిక 7వ తరగతి చదువుతోంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ బాలిక స్థానికంగా ఉండే ఓ యువకుడితో ప్రేమలో పడింది. కాగా కూతురి ప్రేమ వ్యవహారం ఇటీవల తండ్రి అనిల్ సక్సేనా తెలియడంతో కూతురిని మందలించినట్లు సమాచారం. దీంతో అప్పటి నుంచి కూతురు తండ్రిపై కోపంతో ఊగిపోయింది. ఎలాగైన తన తండ్రిని చంపేస్తే ఎంచక్క ప్రియుడితో తిరుగొచ్చనే ఆలోచనలు చేసింది. ఇందులో భాగంగానే ఇదే విషయాన్ని ఆ బాలిక తన ప్రియుడికి చెప్పింది. సరేనని ప్రియుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరు కలిసి ఈ నెల 22న అనిల్ సక్సేనా ఇంట్లోకి వచ్చారు.
ఇక ఆ రోజు అనిల్ సక్సేనా ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ముందుగా అతని కూతురు, ప్రియుడు ఇద్దరు కలిసి అనిల్ సక్సేనా కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేశారు. అనంతరం కూతురు తన ప్రియుడితో కలిసి తండ్రిని దారుణంగా కొట్టి హత్య చేసింది. అనిల్ చనిపోయాడని నిర్ధారించుకున్నాక కూతురు ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక సాయంత్రం అయ్యాక సక్సేనా భార్య ఇంట్లోకి వచ్చి చూడగా భర్త రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని ఆ మహిళ ఏడుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.