కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కిరాతకుడిగా మారాడు. ఏకంగా కూతురికి హత్యకు మాస్టర్ ప్లాన్ గీసి రూ.లక్ష సుపారీ ఇచ్చి దారుణ చర్యకు పావులు కదిపాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. అసలు తండ్రి కన్న కూతురిని చంపించడానికి కారణం ఏమిటి? అంతలా కూతురు చేసిన నేరం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లా. ఓ ప్రాంతంలో నవీన్ కుమార్ అనే వ్యక్తి కుటుంబం నివాసం ఉంటుంది.
అయితే ఇతని కూతురు గత కొంత కాలం నుంచి ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఈ వ్యవహారం పది మందికి తెలిస్తే నా పరువు పోతుందని తండ్రి ముందే గ్రహించాడు. ఇలా అయితే కాదని భావించిన నవీన్ కుమార్ తన కూతురిపై పగ పెంచుకున్నాడు. ఇక ఎలాగైన కూతురిని చంపాలని ప్లాన్ గీశాడు. ఇందులో భాగంగానే స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో వార్డ్ బాయ్ కి సుపారీ కింద రూ.లక్ష ఇచ్చాడు. తండ్రి.. కూతురు కోతులకు భయపడుతుందని చెప్పి ఆస్పత్రిలో జాయిన్ చేశాడు. వెంటనే అలెర్ట్ అయిన వార్డ్ బాయ్ ఆ యువతి శరీరంలోకి పోటాషియం క్లోరైడ్ అధిక మోతాదులో ఎక్కించాడు.
దీని ఫలితంగా ఆ యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీనిని వెంటనే గమనించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.., వార్డ్ బాయ్ ఆ యువతికి పోటాషియం క్లోరైడ్ ఇచ్చినట్లుగా స్పష్టంగా కనిపించింది. పోలీసులు వెంటనే ఆ వార్డ్ బాయ్ ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పెట్టాడు.
దీంతో ఆ యువతి తండ్రి పోలీసుల ఎదుట అవును.. నా కూతురు ఓ యువకుడితో ప్రేమలో ఉంది.. దానిని సహించలేకనే ఇలా హత్య చేయాలనుకున్నానని తెలిపాడు. ఇక ఆ యువతి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అనంతరం వార్డ్ బాయ్ ని, తండ్రి అరెస్ట చేసిన పోలీసులు రూ.90 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కూతురి ప్రేమించిందని హత్యకు పూనుకున్న తండ్రి నిర్ణయం ఎంత వరకు కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.