ఫుల్గా మద్యం తాగి మృగాల్లా ప్రవర్తించారు ఇద్దరు దుర్మార్గులు. ఇంటిముందు నుంచి వెళ్తున్న మహిళను లాక్కెళ్లి అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. నిన్నటి వరకు సైదాబాద్ బాలిక హత్యాచార ఘటన నుంచి తేరుకోకముందే మరో దారణం నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో చేస్తున్నారా? మతిభ్రమించి చేస్తున్నారో తెలియదు గానీ వారి కామవాంఛకు ఏ పాపం తెలియని జీవితాలు నాశనం అవుతున్నాయి. వివరాలు.. నల్గొండ జిల్లా ముషంపల్లికి చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఇంటికి కొద్ది దూరంలో ఆ దంపతులు కిరాణా షాపు నడిపిస్తున్నారు. భార్య (54) ఉదయం షాపుకు బయలుదేరింది. వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన బక్కతొట్ల లింగయ్య ఇంటిదగ్గరకు రాగానే లింగయ్య (35), ఏర్పుజర్ల పుల్లయ్య (35) కలిసి ఇంట్లోకి లాక్కెళ్లారు.
ఆ సమయంలో ఇద్దరూ ఫుల్లుగా తాగి ఉన్నారు. బయట వాన పడుతుండటం, ఆమె మాట బలంగా లేకపోవడంతో అరుపులు ఎవరికీ వినిపించలేదు. లింగయ్య, పుల్లయ్య ఆమెపై అత్యాచారం చేసి చంపేశారు. తర్వాత మృతదేహాన్ని ఇంటి బయట రేకుల షెడ్లో పడేశారు. తర్వాత లింగయ్యను మృతదేహం దగ్గర ఉంచి పుల్లయ్య రోడ్డుపైకి వెళ్లాడు. స్కూలు దగ్గర ఆ మహిళ మరిది కనిపించడంతో దగ్గరికెళ్లి మీ వదిన రోడ్డుపై పడి ఉందని చెప్పాడు. అతను పరుగున వచ్చి చూడగా రక్తపు మడుగులో ఆమె కనిపించింది. ఇంట్లో వంట గది, బెడ్రూంలో గాజులు పడి ఉండటంతో పాటు రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే ఇద్దరూ అత్యాచారం చేశారని చెప్పారు. భర్త భిక్షమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. నిందితులను గ్రామస్తులు చితకబాది పోలీసులకు అప్పగించారు. లింగయ్య, పుల్లయ్య ఇద్దరూ కూలీలు. పుల్లయ్య మొదటి భార్య విడాకులు తీసుకోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య, ఏడాది వయసున్న కూతురును చంపేశాడు. లింగయ్య వారం క్రితం గ్రామంలో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు.