పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐపై దాడి చేసి దారుణంగా హత్యచేశారు.. ఈ ఘటన తమిళనాడులో శనివారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తిరుచ్చి జిల్లా నావల్పట్టు పోలీస్ స్టేషన్లో భూమినాథన్ (56) సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా శనివారం రాత్రి పెట్రోలింగ్ కి వెళ్లాడు. ఆ సమయంలో ఎస్సై భూమినాథన్ కు నావల్పట్టు ప్రధాన రహదారిపై ఓ ముఠా మేకలను తరలిస్తూ తారసపడింది. ముఠాను అడ్డుకున్న ఎస్ఐ భూమినాథన్ వాహన తరలింపు, ఇతర విషయాలను ఆరా తీశాడు.
విచారణలో వారు చుట్టుపక్కల ప్రాంతాల్లో మేకలను దొంగిలించే ముఠా అని తెలింది. ఎస్ఐ.. వారిని ప్రశ్నిస్తుండగానే అక్కడి నుంచి పారిపోయారు. దీంతో మోటర్ సైకిల్ పై ఎస్సై వారిని వెంబడించాడు. పల్లతుపట్టి గ్రామం అనే గ్రామ సమీపంలో ముఠాలోని ఇద్దరినీ పట్టుకున్నాడు. ఇదే సమయంలో పారిపోయిన ముఠాసభ్యులు తిరిగి వచ్చి తమ వారిని వదిలేయాలని ఎస్సైతో ఘర్షణకు దిగారు.
అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో తమ వద్ద ఉన్న పదునైనా ఆయుధాలతో దారుణంగా హత్యచేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ హత్య జరగ్గా.. ఉదయం ఐదు గంటల సమయంలో అతడిని అటుగా వెళ్తున్న స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.