నేటికి అక్షరాస్యతకు దూరంగా ఉన్న చాలా గ్రామాలు మంత్రాలతోనే రోగాలు నయమవుతాయని ఇంకా నమ్ముతూనే ఉన్నారు. నమ్మడమే కాకుండా నట్టేట్ట మునిగిపోతున్నారు. ఇలాంటి మంత్రతంత్రాతో ఫేక్ బాబాలు ప్రజలను నమ్మిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఓ ఫేక్ బాబా అభం శుభం తెలియని ఓ మహిళను కామంతో లొంగదీసుకుందామనుకున్నాడు. అయితే తాజాగా ఓ ఫేక్ బాబా వికృత చేష్టలు, కామ క్రీడలకు ఒప్పుకోకపోవడం కారణంగా ఓ 20 ఏళ్ల యువతి బలైందని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్ పల్లి గ్రామం. ఈ గ్రామంలోనే దుర్గయ్య, రాజేశ్వరి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. హాయిగా సాగుతున్న వీరి జీవితంలో ఎప్పుడు అనారోగ్యం అనిపించినా స్థానికంగా ఉండే గాంధీనగర్ ప్రాంతంలో బిక్షపతి అనే బాబా దగ్గరకు వెళ్తారు. ఆయన ఇచ్చే మంత్రాలు, తంత్రాలు, నాటు మందులతో నయమవుతాయనేది వీరి నమ్మకం. అలా అప్పడప్పుడు వెళ్తున్న క్రమంలో బాబా బిక్షపతి దుర్గయ్య భార్య రాజశ్వరి అందంపై కన్నేశాడు. ఎలాగైన రాజేశ్వరిని లొంగదీసుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదనే చెప్పాలి.
ఇటీవల ఓ రోజు రాజేశ్వరి తన 20 ఏళ్ల కూతురు శ్రావణి అనారోగ్య పాలవడంతో బాబా బిక్షపతి వద్దకు వెళ్లారు. రాజేశ్వరి రాక కోసం ఎదురుచూస్తున్న బాబాకు ఆ సమయం కూడా రానే వచ్చింది. ఇక రాజేశ్వరి కూతురికి ఏదో మందు ఇచ్చి పడుకోబెట్టాడు. ఆ రోజంతా అక్కడే ఉండాలని బిక్షపతి చెప్పడంతో రాజేశ్వరి భర్త కూతురితో పాటు భార్యను రాత్రంతా అక్కడే ఉంచి వెళ్లాడు. దీంతో మెల్లగా బాబా బిక్షపతి నా కోరిక తీర్చాలంటూ రాజేశ్వరిని కామంతో అడిగాడు. దీంతో ఫేక్ బాబా వేధింపులకు తలొగ్గని రాజేశ్వరి ఆయన కోరికను నిరాకరించింది.
ఇక ఇదిలా ఉండగానే రాజేశ్వరి కూతురు శ్రావణి తెల్లారేసరికి అక్కడే మరణించింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాబా కోరిక తీర్చని కారణంగానే మంత్రాలతో నా కూతురిని చంపేశాడంటూ భార్య రాజేశ్వరి, కుటుంబ సభ్యులు నిలదీయడంతో పాటు కాస్త గొడవ సృష్టించారు. గ్రామంలో అల్లర్ల వాతావరణం నెలకొనడంతో స్థానికుల సమాచారం మేరకు బాబా బిక్షపతిని అదుపులోకి తీసుకున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.