ప్రేమ అనే బంధం ఒక మధురానుభూతి.. తమ ప్రేమను గెలిపించుకుని ఆనందంగా జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ, భగ్న ప్రేమికులుగా మిగిలిపోయి.. ప్రియురాలు/ప్రియుడిని మర్చిపోలేక జీవితాన్ని నెట్టుకొస్తున్న వారు కూడా లేకపోలేదు. ఈ రెండు వర్గాలు కాకుండా మరో క్యాటగిరీ కూడా ఉంది. అదే ప్రేమ కోసం పోరాడి పెద్దల చేతుల్లో బలైపోయిన వారు. ఈ వర్గానికి చెందిన వారు కూడా.. ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో పేరు చేరింది.. ప్రియురాలిని కలవడానికి వెళ్లిన ఓ యువకుడిపై యువతి బంధువులు దాడి చేయడంతో అతను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. జూన్ 5న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలోని దాదామోని శివ(18), అచ్చంపేట మండలం చవుటపల్లికి చెందిన యువతిని ప్రేమించాడు. ఈ నెల 5న యువతి ఆమె చిన్నమ్మ ఇంటికి వెళ్లిందని తెలిసి.. శివ కూడా ఆమెను కలిసేందుకు కమ్మారెడ్డిపల్లికి వెళ్లాడు. ఆ ఊరిలో శివను చూసిన యువతి బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. శివను పట్టుకుని మా అమ్మాయి దగ్గరికి మళ్లీ ఎందుకు వచ్చావ్ అంటూ దాడికి దిగారు.
యువతి బంధువులు దాడిలో గాయపడిన శివ ఇంటికి వెళ్లగా.. తల్లిదండ్రులు నాగర్ కర్నూలులోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు హైదరాబాద్ తీసుకెళ్లాల్సిందిగా సూచించడంతో.. నిమ్స్ లో చేర్పించారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న శివ ఈనెల 9న మృతి చెందాడు. శివ మృతిపై తల్లిదండ్రులు పలు ఆరోపణలు చేస్తున్నారు. యువతి బంధువుల విషయంలోనే కాకుండా పోలీసుల తీరుపై కూడా విమర్శలు చేస్తున్నారు.
శివను ప్రణాళిక ప్రకారమే హత్య చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శివపై దాడి చేసిన తర్వాత అతను మంచినీళ్లు అడిగితే పురుగుల మందు తాగించారని ఆరోపణలు చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తే తిరిగి శివను బెదిరిచారంటూ పోలీసులు తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ మృతుడి తల్లిదండ్రులు ఎస్పీ మనోహర్ కు ఫిర్యాదు చేశారు. దాడి కేసు పెట్టమంటే రివర్స్ లో శివపై కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారన్నారు. ఈ ఘనటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.