తండ్రి తమ పిల్లలను ప్రాణానికి ప్రాణంగా పెంచుతాడు. వారికి ఏ కష్టం రాకుండా కావలి కాస్తాడు. కానీ, కొందరు పిల్లలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. కన్నతండ్రి అని కూడా చూడకుండా కాటికి పంపేస్తారు. కొడుకు పుట్టగానే పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుట్టాడు అనుకుంటారు. కానీ, కొందరు కొడుకులు నేరుగా పైలోకానికే పంపేస్తున్నారు. వారు కోరుకున్నది దక్కకపోతే తల్లిదండ్రుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. అలాంటి పుత్రరత్నం ఒకడు.. ఆస్తి కోసం కన్నతండ్రిని గొంతుకోసి హత్య చేశాడు. అక్కడితో ఆగకుండా దుప్పటిలో కట్టేసి కాల్చేశాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. వినిత్ కుమార్ తన తండ్రి, అమ్మ, సోదరిలతో కలిసి ఢిల్లీలో నివాసముంటున్నాడు. అతను వారి ఇల్లును అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తండ్రి ఒప్పుకోవడం లేదు. దాదాపు రెండేళ్లుగా వారి మధ్య ఇల్లు అమ్మకంలో గొడవ పడుతూనే ఉన్నారు. తల్లి, సోదరి ఇంట్లో లేని సమయంలో మరోసారి తండ్రితో వినిత్ కుమార్ ఇంటి విషయంలో గొడవ పడ్డాడు. ఎంతకీ ఇల్లు అమ్మేందుకు ఒప్పుకోడని భావించిన వినిత్ తండ్రిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
మృతుడి భార్య ఆశాదేవి, కుమార్తె ఆగ్రా వెళ్లారు. ఇంట్లో వినిత్, అతని తండ్రి మాత్రమే ఉన్నారు. తండ్రిపై కక్ష పెంచుకున్న నిందితుడు కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని దుప్పట్లో చుట్టేసి కాల్చేశాడు. ఈ ఘటనపై పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వినిత్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.