తాను చేసిన తప్పుకు తన ఇద్దరు బిడ్డల్ని బలి తీసుకున్నాడు ఓ తండ్రి. కోటప్పకొండ తిరునాళ్లకు తీసుకెళతానని చెప్పి ఇద్దరు పిల్లల్ని సాగర్లో కాలువలో తోసేశాడు. అనంతరం తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బల్లికురవ మండలంలోని గుంటుపల్లి గ్రామానికి చెందిన గుర్రం చిరంజీవి (36)కి 11 ఏళ్ల క్రితం మార్టూరు మండలం వలపర్ల గ్రామానికి చెందిన కల్యాణితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కృష్ణ (10), శాయి సౌమ్య (8) ఉన్నారు.
గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చైతన్య కృష్ణ నాల్గవ తరగతి చదువుతుండగా.. సౌమ్య 3వ తరగతి చదువుతోంది. మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా పానీపూరి కావాలని పిల్లలు తండ్రి చిరంజీవిని కోరారు. బల్లికురవ తీసుకెళ్లి పానీపూరి తినిపించి అక్కడి నుంచి కోటప్పకొండ తిరునాళ్లకు తీసుకెళ్తానని భార్య కళ్యాణికి చెప్పాడు. బైకుపై తీసుకువచ్చి పానీపూరి తినిపించి అక్కడ నుంచి అద్దంకి బయలుదేరాడు. దారిలో సాగర్ అద్దంకి బ్రాంచ్ కాలువ వల్లాపల్లి లాకుల వద్ద బైకును ఆపాడు. ఆ తర్వాత తన ఇద్దరు బిడ్డలను సాగర్ కాలువలో తోసి తను కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరునాళ్లకని వెళ్లిన భర్త, పిల్లలు తిరిగి రాకపోవడంతో కోటప్పకొండలోని బంధువుల ఇళ్ల వద్ద కల్యాణి విచారించింది.
సాగర్ కాలువ వల్లాపల్లి లాకుల వద్ద చిరంజీవి బైకు, చెప్పులు, కుమారుడు చైతన్య కృష్ణ చెప్పులు ఉన్నాయన్న సమాచారం తెలియటంతో బల్లికురవ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గజ ఈతగాళ్లతో సాగర్ కాలువలో గాలింపు చేపట్టారు. బొల్లాపల్లి లాకుల వద్ద చిరంజీవి మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు సీహెచ్సీకి తరలించారు. చిన్నారుల కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. చిరంజీవికి రూ.20 లక్షలకుపైగా అప్పులు ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై చిరంజీవి మదనపడుతుండేవాడని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.