సమాజంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యమయ్యాయి. ఎన్ని చట్టాలు ఉన్నా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. బయటనే కాదు. ఇంట్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా వరకట్న వేధింపులకు మహిళలు బలవుతున్నారు. ఈ వరకట్న వేధింపుల తాళలేక కొందరు మహిళలు.. భర్తలు, అత్తమామల చేతుల్లో గాయాలు పాలుకావడం, హత్యకు గురికావడం లేదా ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతుంది. ఇలాంటి ఘటనలు మనం అనేకం చూశాం. ఇంకా దారుణం ఏమిటంటే కొందరు మహిళలు పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ యువతి.. భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక అనుమానస్పద స్థితి మృతి చెందింది. తాజాగా ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అనంతపురం జిల్లా ఉరవకొండలోని మాస్టర్ సీవీవీ నగర్ చెందిన శివరాం పేట మల్లికార్జున కుమారుడు వినోద్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అతడికి బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన ఓబులేసు, లక్ష్మిదేవి దంపతుల కుమార్తె శిరీష(26)ను ఇచ్చి 2020 నవంబర్ 21న వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.2 లక్షల డబ్బులు, 26 తులాల బంగారం శిరీష వాళ్ల తల్లిదండ్రులు ఇచ్చారు. పెళ్లి జరిపించే స్తోమత లేక ఆ ఖర్చుల కోసం శిరీష తండ్రి భూమిని అమ్మి వివాహం జరిపించాడు. అంతేకాక కుమార్తె జీవితం బాగుండాలని భావించి ఇచ్చిన కట్నం కంటే అదనంగా బుక్కరాయసముద్రంలో ఖరీదైన ఐదు సెంట్ల స్థలాన్ని శిరీష పేరున రాసిచ్చాడు.
కుమార్తె కోసం ఇంత చేసిన అల్లుడి బుద్ది చెడుగా మారింది. ఆ స్థలాన్ని తన పేరున రాయించాలని వినోద్ శిరీషను హెచ్చరించాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్య తరచు గొడవ జరిగేది. ఆ స్థలాన్ని తన పేరు రిజిస్టర్ చేయాలని శిరీషను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. ఈ విషయంలో వినోద్ కి వారి తల్లిదండ్రులు, అక్క భారతీ, బావ ధనుంజయ్ వత్తాసు పలికేవారు. ఏడాది క్రితం గర్భిణి అయిన శిరీషను ఇంట్లోంచి గెట్టేంశారు. దీంతో శిరీష తల్లిదండ్రులు పెద్ద సమక్షంలో పంచాయితీ పెట్టి రాజీ కుదిర్చారు. అయినా వినోద్ , అతడి కుటుంబ సభ్యులు ఏ మార్పుల రాలేదు. ఈక్రమంలోనే ఆదివారం తెల్లవారు జామున ఇంట్లోనే అనుమానస్పదస్థితిలో శిరీష మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు వెంటనే ఉరవ కొండ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు.
అక్కడ మార్చురీలో ఉన్న తమ కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు శిరీష తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. “ఆస్తి కోసం కడతేరుస్తారనుకోలేదమ్మా.. ఎంతటి నరకాన్ని అనుభవించావో కదా తల్లి.. కష్టాలు ఉన్నప్పుడు ఒక్కసారైన నీకు మేము గుర్తుకు రాలేదా?” అంటు మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. “ఆ దుర్మార్గులను వదిలేసి మన ఇంటికి వచ్చి ఉంటే కంటికి రెప్పలా చూసుకునే వాళ్లం కదమ్మా” అంటూ శిరీష తల్లి గుండెలు పగిలేలా రోదించింది. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.