తమ బిడ్డలపై తల్లిదండ్రులు ఎనలేని ప్రేమ చూపిస్తుంటారు. బిడ్డలకు ఏ చిన్న కష్టం కూడా కలగకుండా చూసుకుంటారు. ఇక తండ్రి అయితే బిడ్డలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాడు. తనకు ఎలాంటి సౌకర్యాలు లేకున్న.. బిడ్డలకు అన్ని అవసరాలు తీరేలా తండ్రి నిరంతరం శ్రమిస్తుంటాడు. అయితే కొందరు తండ్రులు మాత్రం భార్యలపై అనుమానంతో పిల్లలపై దారుణాలకు తెగ బడుతుంటారు. తాజాగా తన ఇద్దరి బిడ్డలను రాత్రి సమయంలో అడవుల్లో వదిలేసి వచ్చాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కర్నూలు జిల్లాలోని కోడుమూరులో ప్రాంతంలో నివాసం ఉంటున్న కృష్ణ అనే వ్యక్తి.. తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ కృష్ణ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానంతో పిల్లలపై కూడా కోపం పెంచుకున్నాడు. తన భార్యపై అనుమానంతో కృష్ణ పిల్లలను ఆటోలో తీసుకెళ్లి అడవిలో వదిలేందుకు సిద్దమయ్యాడు. అయితే అడవికి వెళ్లే మార్గం మధ్యలో పాలకుర్తి సమీపంలో ఆటోతో సహా పిల్లలను కాలువలో పడేసి కృష్ణ పరారయ్యాడు. కాలువలో నీరు లేకపోవడంతో ఇద్దరు పిల్లలు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అక్కడ ఇద్దరు పిల్లలు కొద్దిసేపు బిక్కు, బిక్కుమంటూ గడిపారు.
కాలువలో పడిపోయిన ఇద్దరు పిల్లల ఏడుపుల్ని విని స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందిచారు. అక్కడి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో ఆ ఇద్దరు పిల్లల్ని రక్షించి.. కుటుంబ సభ్యులకు అప్పగించారు. పిల్లలను కాలువు లో పడేసిన వారి తండ్రిపై కేసు నమోదు చేశారు.అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. .. ఇంత కర్కశంగా ప్రవర్తించిన తండ్రిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.