ఈ సృష్టిలో అత్యంత దారుణమైన స్థితి ఏదైనా ఉంటే అది పేదరికంలో బతకటమే. పేదరికం ద్వారా కలిగే ఆకలి బాధ మనిషిని యోగిలా మారుస్తుంది లేదా మృగంలా మారుస్తుంది. కన్నబిడ్డల్ని సైతం అమ్ముకునేలా చేస్తుంది. ప్రస్తుతం రాయసీమలోని ఓ మూడు జిల్లాల్లో ఇదే జరుగుతోంది. తమ ఆకలి తీర్చుకోవటానికి కొన్ని కుటుంబాలు తమ ఆడ బిడ్డల్ని రెడ్ లైట్ ఏరియాలకు అమ్మేస్తున్నారు. దళారుల మాటలు విని తమ బిడ్డల్ని నరక కూపంలోకి తోసేస్తున్నారు. బాల్యం చీకటి కొంపలకు బలై.. వయసు వచ్చే సరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్న అభాగ్యురాళ్లు ఎంతో మంది ఉన్నారు. వీరిదంతా లోకానికి తెలియని ఓ విషాద గాధ..
పేదరికంలో పుట్టడమే శాపం
టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా.. నాగరికత ఎంత అభివృద్ధి చెందుతున్నా రాయలసీమలోని కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని పలు గిరిజన తాండాల్లో ఇంకా దరిద్రం తాండవిస్తోంది. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి, పీలేరు.. కడప జిల్లాలోని రాయచోటు, రాజంపేట.. అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకర్గం పరిధిలోని గిరిజన తాండాల్లోని గిరిజనులు దుర్భర దారిద్రంలో బతుకుతున్నారు. ఒకపూట తినడానికి కూడా లేని వారు ఎంతో మంది ఉన్నారు. తమ ఆకలిని తీర్చుకోవటానికి సొంత ఆడ బిడ్డల్ని సైతం వారు అమ్ముకుంటున్నారు. తమ కడుపు నింపుకోవటానికి ఇంటి అమ్మాయిల్ని రెడ్ లైట్ ఏరియాలకు విక్రయిస్తున్నారు. ముంబై, దివాండి, పుణె, గురుగ్రామ్, కలకత్తా రెడ్ లైట్ ఏరియాల్లో తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. వీరిలో కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. బ్రిటీష్ కాలం నుంచి ఈ దారుణం జరుగుతోంది.
చీకటి కొంపల్లో కుటుంబం కోసం బలై..
తమకు ఇష్టం లేకపోయినా బలవంతం మీద, కుటుంబం కడుపు నింపటానికి వ్యభిచారంలోకి వెళుతున్నారు. 12 ఏళ్లు వచ్చి రాగానే చీకటి కొంపలకు తరలివెళుతున్నారు. బంగారం లాంటి బాల్యం మొత్తం రెడ్ లైట్ ఏరియాల్లో బలైపోతోంది. మృగాళ్ల పక్కల్లో నలిగి పోతూ తమ కుటుంబం కోసం డబ్బులు పంపిస్తున్నారు. వీరు పంపే డబ్బులతో కుటుంబాలు నిలదొక్కుకుంటున్నాయి. అయితే, వీరికి రోగాలు వచ్చినపుడు మాత్రం కథ మారుతోంది. అనారోగ్యంతో ఇంటికి వస్తే మాత్రం కుటుంబాలు పట్టించుకోవటం లేదు. ఇంటినుంచి దూరంగా ఊరి బయట ఉంచుతున్నారు. అనారోగ్యం కారణంగా వారి జీవితం 20-30 సంవత్సరాలకే ముగుస్తోంది. రెడ్ లైట్ ఏరియాలనుంచి వచ్చిన వారిని ప్రభుత్వాలు కూడా సరిగా పట్టించుకోవటం లేదు.
దళారుల దందా!
పేద అమ్మాయిల పాలిట దళారులు రాబందుల్లా మారుతున్నారు. గోతి కాడ నక్కల్లా వారి కోసం కాచుకు కూర్చుంటున్నారు. గిరిజన తాండాల్లోని అమ్మాయి కుటుంబాల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. 12 ఏళ్లు నిండగానే బాలికలను వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. వీరిని దేశ విదేశాలకు పంపిస్తున్నారు. దళారుల కారణంగానే ఎక్కువ మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. మరి, వ్యభిచార కూపంలో బలవుతున్న తెలుగు ఆడబిడ్డల జీవితాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.