క్రికెట్ ఆడుతూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రాణాలు విడిచిన ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన తుషార్ ఆమ్రా బెద్వా (32) అనే వ్యక్తి తన భార్య పూజా బెద్వా, తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ గండిపేటలోని బండ్లగూడలో రాయల్ ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్నాడు. హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న తుషార్.. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో స్నేహితులతో కలిసి ఆయన అపార్ట్ మెంట్ దగ్గర ఉన్న సన్ సిటీ ఎస్బీఐ గ్రౌండ్స్ లో క్రికెట్ ఆడేందుకు వెళ్ళాడు.
అయితే క్రికెట్ ఆడుతుండగా ఆట మధ్యలో ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన తుషార్ స్నేహితులు.. అతన్ని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు తుషార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తుషార్ గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే తుషార్ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.