హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకల రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజు అనే వ్యక్తిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన మరువక ముందే నగరంలో మరో ఘోరం జరిగింది.
హైదరాబాద్ మియాపూర్లో ఓంకార్ నగర్లో నిన్న కనిపించకుండా పోయిన 13 నెలల చిన్నారి విగతజీవిగా కనిపించింది. ఇంటి సమీపంలోని నీటి సంపులో బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. చెత్త ఏరుకుని జీవించే ఆ దంపతులు ఆదివారం ఉదయం బయటికి వెళ్తూ చిన్నారికి పక్కింట్లో వదిలారు. సాయంత్రం వచ్చేసరికి పాప కనిపించకపోవడంతో పక్కింటివారిని అడగ్గా తమకు తెలియదని చెప్పారు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉండే 13ఏళ్ల బాలుడు పాపను ఎత్తికెళ్లి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అప్పటి వరకూ ఆడుకుంటూ ఉన్న పసికందు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక హత్య చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాప కళ్లు పొడిచేసి ఉండటంతో ఎవరో ఉద్దేశపూర్వకంగానే చేసి ఉంటారా? లేదా ఎవరైనా సైకో ఇలాంటి దారుణానికి తెగబడి ఉంటాడా.. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక సరైన కోణంలో దర్యాప్తు చేపట్టి నిజాలు నిగ్గు తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు.