Siddipet: కూతురు జ్వరంతో చనిపోయిందని అత్తింటి నుంచి అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. కుటుంబం మొత్తం బరువెక్కిన గుండెతో అక్కడికి చేరింది. అమ్మాయి అత్తింటివారు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో అంత్యక్రియలు జరుగుతాయనగా ఓ భయంకరమైన విషయం తెలిసింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మొత్తం చదివేయండి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నల్గొండ జిల్లాకు చెందిన కాత్యాయినికి, సిద్దిపేటలోని మునిగడపకు చెందిన నాగరాజుతో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొన్ని నెలలకే వారి కాపురంలో గొడవలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి కాత్యాయిని జ్వరంతో చనిపోయిందని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందింది. దీంతో కుటుంబసభ్యులు మొత్తం అల్లుడి ఇంటికి వెళ్లారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. అంత్యక్రియలకోసం కాత్యాయిని మృతదేహానికి స్నానం చేయిస్తుండగా ఆమె తల్లి కూతురి చేతిపై గాయాలు ఉండటం గమనించింది. అనుమానంతో శరీరం మొత్తం చూడగా అంతటా గాయాలు కనిపించాయి. దీంతో గాయాలపై నాగరాజును నిలదీసింది. అయితే, నాగరాజు సమాధానం చెప్పకుండా కుటుంబంతో సహా అక్కడినుంచి పరారయ్యాడు.
ఇక, కాత్యాయిని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అల్లుడి కుటుంబంపై ఫిర్యాదు చేశారు. తమ కూతుర్ని కొట్టి చంపి, జ్వరం వచ్చి చనిపోయిందంటూ నాటకం ఆడుతున్నారని కంప్లైంట్లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాత్యాయిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చచదవండి : అమ్మా.. నన్ను క్షమించు, పురుగుల మందు తాగాను! కొడుకు చివరి మాటలకు తల్లి కంటతడి!