పన్ను ఎగవేస్తూ హైదరాబాద్లో యథేచ్ఛగా తిరుగుతున్న లగ్జరీ కార్ల యజమానులపై దృష్టి సారించిన రవాణాశాఖ రవాణాశాఖ కొరడా విసిరింది. అక్రమంగా తిరుగుతున్న 11 ఖరీదైన కార్లను సీజ్ చేసింది. ఈ క్రమంలో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పాపారావు నేతృత్వంలో చర్యలకు ఉపక్రమించారు. 40 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు, మోటర్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేస్తున్న కార్ల యజమానులను గుర్తించేందుకు రవాణాశాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.
సీజ్ చేసిన వాహనాల్లో మెర్సిడెస్ బెంజ్, మాసరట్టి, ఫెరారీ, రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ, లంబొర్గిని తదితర ఖరీదైన కార్లు ఉన్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు ఇలాంటి వాహనాల పన్నులను వసూలు చేస్తే రూ.150 కోట్ల మేర ఆదాయం సమకూరనున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీఏ అధికారులకు పట్టుబడుతున్న లగ్జరీకార్లలో చాలా వరకు పుదుచ్చేరి, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కార్లే ఎక్కువగా ఉంటున్నాయి.
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన కార్లకు 2వందల శాతం వరకు పన్నులు చెల్లించాల్సి ఉంటుందని, నిబంధనల ప్రకారం పత్రాలు పరిశీలించి ట్యాక్స్ వసూలు చేసిన తర్వాత ఆ కార్లను యజమానులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి హైఎండ్ లగ్జరీ కార్లు కొన్న యజమానులు రాష్ట్రానికి రావాల్సిన పన్ను చెల్లించాలని కోరారు. పన్ను చెల్లించకుండా తిరిగితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. రవాణా శాఖ చరిత్రలో ఇలాంటి దాడులు జరగడం ఇదే తొలిసారి.
సీసీటీవీ ఫుటేజీలు, స్థానిక పోలీసుల సహకారం సహా పలుమార్గాల్లో సేకరించిన సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 80 నుంచి 100 వరకు ఈ తరహా లగ్జరీ కార్లు పన్నులు చెల్లించకుండా రాష్ట్ర రోడ్ల పై తిరుగతున్నట్టు గుర్తించామని డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ పాపారావు తెలిపారు.