రంగా రెడ్డి జిల్లాలోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీ, మన్నేగూడెకు చెందిన ఓ యువతి కిడ్నాప్కు గురైన సంగతి తెలిసిందే. సిరి టౌన్ షిప్లో 100 మంది యువకులు కలకలం సృష్టించారు. శుక్రవారం సిరిటౌన్ షిప్కు చెందిన ముచ్చెర్ల దామోదర్ రెడ్డి, నిర్మల దంపుతుల కుమార్తె వైశాలిని ఎత్తుకెళ్లిపోయారు. మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి తమ కుమార్తెను కిడ్నాప్ చేశాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో అన్వేషిస్తున్నారు.
ప్రేమ వ్యవహారమే కారణం?
తాజా సమాచారం ప్రకారం.. మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి, వైశాలి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. అయితే, వీరి ప్రేమ, పెళ్లి పీటలు ఎక్కేలోపే చెదిరిపోయింది. ఇద్దరూ గొడవలు పడి విడిపోయారు. గత కొన్ని నెలల నుంచి వైశాలి, నవీన్కు దూరంగా ఉంటోంది. అయితే, వైశాలిని వదులు కోవటం ఇష్టం లేని నవీన్ ఆమె వెంటపడుతూనే ఉన్నాడు. పెళ్లి చేసుకోమని వేధిస్తున్నట్లు సమాచారం. నవీన్ అంటే విరక్తిపుట్టిన వైశాలి మరో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. శుక్రవారం పెళ్లి సంబంధం కోసం పెళ్లివాళ్లు వస్తున్నారని నవీన్కు తెలిసింది. దీంతో 100 మంది యువకులతో వైశాలి ఇంటికి వచ్చాడు. వైశాలిని అక్కడినుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు.
తుర్కయాంజాల్లో ఉద్రిక్త పరిస్థితి!
ఇంటికి వచ్చి తమపై దాడి చేసి వైశాలిని ఎత్తుకుపోవటంతో ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవీన్ రెడ్డి మిస్టర్ టీ స్టాల్ను ధ్వంసం చేశారు. అనంతరం దానికి నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కిలోమీటర్ల మేర రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక, ఆదిభట్ల సీఐ నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు కిడ్నాప్కు గురైందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.